కాంగ్రెస్ మోసం: టిపై బాబు, సమైక్యవాదిని: సోమిరెడ్డి
పంచాయతీ ఎన్నికలలో రెండు విడతల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించినందుకు చంద్రబాబు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం అధ్వాన్నంగా తయారయిందన్నారు. తాగునీరు, డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందన్నారు. లక్ష కోట్లు దోచుకున్న పిల్ల కాంగ్రెసు, వసూళ్ల తెరాస, పాలనను వదిలేసిన కాంగ్రెసుకు మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయవద్దన్నారు. రాష్ట్రాన్ని తమ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ చేద్దామనుకుంటే, నేటి కాంగ్రెసు మధ్యాంధ్రప్రదేశ్, అంధకార ఆంధ్రప్రదేశ్ చేసిందన్నారు.
సమైక్యవాదిని: సోమిరెడ్డి
తెలంగాణపై పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని అయితే, వ్యక్తిగతంగా మాత్రం తాను సమైక్యవాదిని అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలంగాణ అడిగితే రాయలసీమను విభజిస్తామని చెప్పడమేమిటని ప్రశ్నించారు. ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెసుది దుర్మార్గపు ఆలోచన అన్నారు. రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. కాంగ్రెసు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి చేయవద్దన్నారు. ఉత్తరాఖండులో వరదలు వస్తే ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చిందని, చిన్న రాష్ట్రాల పరిస్థితి అంతే అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే మిగతా ప్రాంత ప్రజల మనోభావాలను, ప్రయోజనాలను ఎలా కాపాడుతారో కాంగ్రెసు పార్టీ చెప్పాలన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారన్నారు.
కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్కు రాయలసీమను విభజించే హక్కు ఎక్కడిది అన్నారు. సీమ విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంటే తమ ప్రాంత తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు. తమకు పార్టీ ముఖ్యమే, తమ ప్రాంతం కూడా ముఖ్యమే అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా తాము పడి ఉండాలంటే ఒప్పుకునేది లేదన్నారు. తమ ప్రాంతానికి నష్టం జరిగితే రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రాయల తెలంగాణకు తాము వ్యతిరేకమన్నారు.
ఢిల్లీ, హైదరాబాదులలో కూర్చొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక సమస్య వస్తే కాంగ్రెసు మరో సమస్యను తెచ్చి పెడుతోందని ఆరోపించారు. విభజన జరిగితే కడప, చిత్తూరు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలకు నీటి సమస్యలు వస్తాయన్నారు.