రాయల టీ వెనక్కి: తెలంగాణనే, మారిన వైఖరి

హైదరాబాద్ను కొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలు కూడా లేవని చెబుతున్నారు. హైదరాబాద్ను ఎన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే విషయంపై కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయం చేయనున్నట్లు చెబుతున్నారు.
రాయల తెలంగాణకు రాయలసీమ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాయల తెలంగాణ ప్రతిపాదనపై తీవ్రంగా ప్రతిస్పందించారు. ఒక్క ప్రాంతాన్ని విడగొట్టాలనే డిమాండ్ వస్తే కాంగ్రెసు రెండు ప్రాంతాలను విడగొట్టడానికి సిద్ధపడుతోందని ఆయన మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతాన్ని రెండుగా విభజిస్తే సహించేది లేదని కూడా ఆయన హెచ్చరించారు.
రాయలసీమకు చెందిన కాంగ్రెసు నాయకులు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సహా మెజారిటీ నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేదంటే మూడుగా విభజించాలని వారు అంటున్నారు. తెలంగాణ జెఎసి కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే అడుగుతున్నట్లు చెప్పారు.
కాగా, తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా తాము పది జిల్లాలతో కూడిన తెలంగాణనే కోరుతున్నామని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకించింది. బిజెపి కూడా దానికి వ్యతిరేకంగా ఉంది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలంటే బిజెపి మద్దతు అవసరం. బిజెపి వైఖరికి భిన్నంగా నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. దీంతో రాయల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
రేపు మంగళవారం సాయంత్రం యుపిఎ సమన్వయ కమిటీ, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాలు జరగనున్నాయి. సిడబ్ల్యుసిలో తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశాలున్నాయి. రేపు తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications