ఉత్కంఠ: తెలంగాణపై కిరణ్ రెడ్డి ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్ర విభజన భారాన్ని తాను మోయలేనని ఆయన ఇప్పటికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, ఆయన తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. రేపు మంగళవారం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలను అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది.
రేపు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం, ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరగనున్నాయి. సిడబ్ల్యుసి సమావేశం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుని నిర్ణయం వెలువరించనుంది. ఈ నిర్ణయం పార్టీ నిర్ణయంగా ముందుకు వస్తుంది. ఆ తర్వాత విభజన ప్రక్రియ మొత్తం యుపిఎ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతుంది.
సిడబ్ల్యుసి రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరిస్తారా అనేది ప్రశ్నగా మిగిలింది. ఆయన ఏం చేస్తారనే విషయంపై సీమాంధ్ర కాంగ్రెసు నేతల కార్యాచరణ ఉంటుందనేది విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటిస్తే కేంద్ర మంత్రుల్లో తెలంగాణకు చెందిన ఎస్ జైపాల్ రెడ్డికి ఏ విధమైన సమస్యా ఉండదు. సీమాంధ్రకు చెందిన కిశోర్ చంద్రదేవ్, కావూరి సాంబశివరావు, పల్లం రాజులకు సమస్య తలెత్తవచ్చు. తాను పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. అందువల్ల వారి నుంచి కాంగ్రెసు అధిష్టానానికి ఏ విధమైన సమస్య తలెత్తకపోవచ్చునని భావిస్తున్నారు.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎలా ప్రతిస్పందిస్తారనేది కూడా ఆసక్తిగానే ఉంది. లగడపాటి రాజగోపాల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైయస్ జగన్కు మద్దతు ఇస్తున్న సబ్బం హరి కూడా పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. మిగతా సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల గురించి ఏమీ తెలియడం లేదు. రేపు సాయంత్రం తెలంగాణపై సిడబ్ల్యుసి సమావేశం తర్వాత తలెత్తే పరిణామాలపై ఏ విధమైన అంచనాలు లభించడం లేదు.
ఆ స్పందన లేదు: శైలజానాత్
అయితే, సీమాంధ్ర నేతల్లో అసంతృప్తి పేరుకుపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో నిరాశ చోటు చేసుకున్నట్లు కూడా అర్థమవుతోంది. 2009 డిసెంబర్ 9వ ప్రకటన తర్వాత సీమాంధ్ర పార్టీల్లో వచ్చిన స్పందన ఇప్పుడు లేకపోవడం బాధాకరమని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. రేపు వెలువడేది కాంగ్రెసు పార్టీ నిర్ణయం మాత్రమేనని, కేంద్రానిది కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్ర విభజన జరగాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని, ప్రస్తుత పరిస్థితిలో అంత సులువు కాదని ఆయన అన్నారు. విభజన కోరుతున్న తెలుగుదేశం పార్టీకి సీమాంధ్రలో అనుకూల ఫలితాలు వచ్చాయని, సీమాంధ్రలో ఆ పార్టీకి ఎక్కువ పంచాయతీలు రావడం తెలంగాణకు సానుకూలంగా మారిందని ఆయన అన్నారు.
బిల్లు ఆమోదించే దాకా ఉద్యమం: కోదండరామ్
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించే వరకు తమ ఉద్యమం సాగుతుందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణపై పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, వాటిని సమీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. కేశవరావు నివాసంలో కెసిఆర్, కోదండరామ్, తెరాస ముఖ్య నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు.
ఇన్నేళ్ల పోరాటం, ఆకాంక్షలకు తగినట్లే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ప్రటించాలని ఆయన అన్నారు రేపు ఉదయం పదిన్నర గంటలకు బిజెపి నేతలను కలిసి పరిస్థితిపై సమీక్షిస్తామని ఆయన చెప్పారు. ఆగస్టు 1వ తేదీన తమ ధర్నా యథాథతంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.
అక్టోబర్లో కాదు, జనవరిలో...?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వచ్చే ఏడాది జనవరిలోగా పూర్తవుతుందని అంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లోగానే పూర్తి చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ, అది సాధ్యం కాదని భావించిన కాంగ్రెసు అధిష్టానం జనవరిలోగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర శానససభకు 2014 మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది.