తెలంగాణపై స్పీడ్: రేపే యుపిఎ, సిడబ్ల్యుసి భేటీలు?
యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 29న ఏర్పాటవుతుందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 31వ తేదీన ఏర్పాటవుతున్నట్లు సమాచారం వచ్చింది. కానీ, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుంది.
సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు, మూడు రోజుల తర్వాత సిడబ్ల్యుసి సమావేశం నిర్వహిస్తారని భావించారు. కానీ, అదే రోజు సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై తేల్చేయాలని కాంగ్రెసు భావిస్తోంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సిడబ్ల్యుసి రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేస్తే అధికారిక ఆమోదం లభించినట్లవుతుంది.
యుపిఎ సమన్వయ కమిటీ, సిడబ్ల్యుసిలు నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రి వర్గ సమావేశంలో దానికి ఆమోదం తెలుపుతారు. ఆగస్టు 5వ తేదీలోగానే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆమోద ముద్ర వేయించుకుంటారు. ఆగస్టు 5వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ అంశాన్ని తేల్చేయాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోంది. రాష్ట్ర విభజన ప్రక్రియను అక్టోబర్ నెలలోగా పూర్తి చేయాలనే ఆలోచనలో కాంగ్రెసు ఉన్నట్లు చెబుతున్నారు.
లోకసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఉండడం వల్ల కూడా రాష్ట్ర విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. నవంబర్లో ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు లోకసభ ఎన్నికలను కూడా నిర్వహించడానికి ఎన్నికల కమీషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముగ్గురికి ఢిల్లీ పిలుపు
ముఖ్మయంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేపు మంగళవారం అందుబాటులో ఉండాలని కాంగ్రెసు అధిష్టానం వారికి వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. రేపు తెలంగాణపై సిడబ్ల్యుసిలో తుది నిర్ణయం తీసుకుంటుండడంతో వారికి ఆ విషయాలను తెలియజేయడంతో పాటు తదుపరి కార్యాచరణపై వారికి సమాచారం ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.