మరో సమస్య: తెలంగాణలోనే టాప్ విద్యాసంస్థలు
హైదరాూబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నత విద్యా సంస్థలు చాలా వరకు హైదరాబాదులోనూ తెలంగాణలోనూ ఉన్నాయి. సీమాంధ్రలో అటువంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేయడమా, కొన్నింటిని తరలించడమా అనే విషయం ఎలా ఉంటుందో తెలియదు.
ఐఐటి మెదక్ జిల్లాలో ఉంది. ఐఐటి - హైదరాబాద్ ఇటీవలి కాలంలోనే ఏర్పాటయింది. దీనికి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని మెదక్ జిల్లాలో భూమిని కేటాయించారు. ట్రిపుల్ ఐటి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఐఎస్బి) హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్నాయి. ఇవి కూడా ఇటీవలి కాలంలోనే ఏర్పాటయ్యాయి.

బిట్స్ పిలాని క్యాంపస్ తెలంగాణలోని షామీర్పేటలో, నిఫ్ట్ - హైదరాబాద్ క్యాంపస్ మాదాపూర్లో, నల్సార్ లా యూనివర్శిటీ షామీర్పేటలో ఉన్నాయి. ఇవి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు. అలాగే రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా హైదరాబాదులోనే ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉన్నాయి.
రాష్ట్ర విభజన వల్ల కేంద్రీయ సంస్థల్లో అడ్మిషన్లపై ఏ విధమైన ప్రభావం ఉండదు. నల్సార్ విశ్వవిద్యాలయం మాత్రం మినహాయింపు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ విశ్వవిద్యాలయంలో 2010 నుంచి ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 20 శాతం కోటాను కేటాయిస్తున్నారు. ఈ 20 శాతం కోటా విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉంటుందా, దాన్ని ఎలా చేస్తారనేది చూడాల్సి ఉంది.
విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే, రాష్ట్రానికి ఇప్పటికే ఐఐటి ఇచ్చినందును దాన్ని మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. విభజన తర్వాత ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయం సీమాంధ్రకు కొత్తగా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
వాటికి తోడు, బిహెచ్ఇఎల్, సిసిఎంబి వంటి పలు కేంద్ర పరిశోధన, అభివృద్ధి సంస్థలు హైదరాబాదులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications