సమైక్యం: మంత్రి పైకి చెప్పు, ఇందిర విగ్రహం ధ్వంసం
కడప/శ్రీకాకుళం: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఆరో రోజు కొనసాగుతోంది. మంత్రి అహ్మదుల్లాకు కడప జిల్లాలో సోమవారం చేదు అనుభవం ఎదురయింది. కడపలో ఆయన పైకి సమైక్యవాదులు చెప్పులు విసిరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు ఇంటిని సమైక్యవాద మహిళలు చుట్టుముట్టారు. రాజీనామా చేయకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పదవుల కోసం సమైక్యవాదాన్ని మరిచిపోయారని వారు ఆరోపించారు. రాజీనామా చేయకుంటే ఆయనను తరిమి కొడతామన్నారు.

విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మంత్రి బాలరాజుకు సమైక్య సెగ తగిలింది. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదులపై మంత్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియంలో సమైక్యవాదులు వంటావార్పు నిర్వహించారు.
సీమాంధ్రలోని పలుచోట్ల సమైక్యవాదులు పలు రైళ్లను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఇందిరా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విజయనగరం బొబ్బిలిలో రాస్తారోకో నిర్వహించారు. పలుచోట్ల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎపి కాంగ్రెసు ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలకు ఉరి వేసి, సమాధి చేశారు.
విజయవాడ హనుమాన్ జంక్షన్లో విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా మానవహారం నిర్వహించారు. హైదరాబాదులో సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసన తెలిపారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు బయటకు వెళ్లకుండా గేట్లు మూసివేశారు.












Click it and Unblock the Notifications