పోడియం వైపు ఎంపీలు, వెనక్కి వెళ్లాలని సోనియా సైగ
తమ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించాలని, తమ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు లేచి నినాదాలు చేశారు. ఆ వెంటనే తెలంగాణ ఎంపీలు పోటీగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాజ్యసభలోను విభజన వేడి రాజుకుంది. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభలు ప్రారంభమైనా సజావుగా సాగకపోవడంతో మరోసారి రెండు గంటలకు వాయిదా వేసారు.
అంతకుముందు లోకసభ, రాజ్యసభలు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో డిఎంకె నేత కనిమొళి ప్రమాణం చేశారు. సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు.
సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను రక్షించాలని వారు నినాదాలు చేశారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టారని మండిపడ్డారు. తెలుగు ప్రజలను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సిఎం రమేష్, శివ ప్రసాద్, కొనకళ్ల నారాయణ, సుజనా చౌదరిలు పాల్గొన్నారు.
కాగా అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. గత సమావేశాల్లోనే చాలా సమయం వృధా అయిందని, ఇప్పుడు అలా జరగకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు.