నిర్ణయం తర్వాత సమైక్యం: పల్లం, ఎర్రమంజిల్లో ఉద్రిక్తత
సోనియాను కలిసిన కర్నూలు నేతలు
కర్నూలు జిల్లాకు చెందిన నేతలు మంగళవారం పార్లమెంటులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో ఎస్పీవై రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులు అధినేత్రిని కలిశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు కోరారు. విభజన అనివార్యమైతే ఎస్పీఎస్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉన్నతస్థాయి కమిటీకి అన్ని అంశాలు చెప్పాలని వారికి సోనియా సూచించారని తెలుస్తోంది. కోట్ల రాయలసీమ హక్కుల గురించి ప్రస్తావించారు.
ఉద్రిక్తత
హైదరాబాదులోని ఎర్రమంజిల్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆందోళనకు దిగిన ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ దశలో తెలంగాణ, సమైక్యవాదులు పోటాపోటీ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యుత్ సౌధ వద్ద కూడా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు టిడిపి నేతల పయ్యావుల కేశవ్ విద్యుత్ సౌధకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంత ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు.
స్వచ్చంధంగా ఉద్యమం
సీమాంధ్ర నేతలు ఏఐసిసి నేత తిరునావక్కరసును కలిశారు. సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకుంటుందని చెప్పారు. ఉద్యమం స్వచ్చంధంగానే జరుగుతోందని వారు ఆయనకు చెప్పారు. ఉద్యమ వేడిని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని మంత్రులు తోట నర్సింహం, పార్థసారథి కోరారు.