బాబూ, నోరు విప్పు: విభజనపై వైయస్ వివేకానంద
విభజన అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో చంద్రబాబు మౌనంగా ఉండటం తగదన్నారు. పదవీకాంక్షతోనే కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు నోరు మెదపడం లేదన్నారు.
మడమ తిప్పేది లేదు: నారాయణ
తమ దిష్టిబొమ్మలనే కాదు, తమను తగలబెట్టినా రాష్ట్ర విభజనపై తమ విధానం మారదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోరుకునే వారు 23జిల్లాల్లోనూ ఆందోళనలు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణపై కెసిఆర్కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఇరుప్రాంతాల ప్రజల అనుమానాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు.
రాష్ట్ర విభజన అనివార్యమైతే సీమాంధ్రుల్ని ఎలా సముదాయించాలనే సిపిఐ కసరత్తు మొదలుపెట్టింది. చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటవుతోందని చెబుతూనే, కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సమన్యాయం దక్కేలా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతోంది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆదివారం హైదరాబాద్లో వివిధ రంగాల నిపుణులు, మేధావులతో చర్చలు జరిపారు.