హైదరాబాద్ను అల్లకల్లోలం చేసేందుకే డిమాండ్లు: కవిత
సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పి కొడదాం.. తెలంగాణను కాపాడుకుందామనే నినాదంతో కార్యాచరణకు దిగుతున్నట్లు తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరాం వేరుగా ప్రకటించారు. ఇందులో భాగంగా 10 (శనివారం) నుంచి హైదరాబాద్లో సద్భావన యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. 12 తర్వాత తెలంగాణ ఉద్యోగులు చేపట్టే అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలకూ జేఏసీ అండగా నిలుస్తుందని చెప్పారు.
తెలంగాణపై సిడబ్ల్యూసి తీర్మానం గురించి, హైదరాబాద్ ఆవశ్యకతపైనా ప్రజలకు అవగాహన కలిగించటానికి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తామని, పెద్దఎత్తున కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తామని వెల్లడించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఐకాస విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ భేటీ అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించే ఆలోచన ఉందని, జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలపైనా ప్రకటన చేస్తామని చెప్పారు.
సిడబ్ల్యూసి చేసిన తీర్మానం కార్యరూపం దాల్చేలా చేసే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనే ఉందని పునరుద్ఘాటించారు. తెలంగాణపై ప్రజలకిచ్చిన హామీకి టిడిపి కట్టుబడి ఉండాలని, ఆ పార్టీ సీమాంధ్ర నేతలు అవాంతరాలు కలిగిస్తున్నారని, ఈ విషయంలో టిడిపి తెలంగాణ నేతలు మౌనంగా ఉండటం శోచనీయమని, వారంతా కదలాలని కోరారు. సమైక్యవాద వైఖరితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.