ఓ పార్టీ పెట్టండి, బాగుకోరితే బాబుది తప్పా: మోదుగుల
ఎకె ఆంటోని పేరిట కమిటీ వేశారని, అలాంటి కమిటీలు ఎవరికి కావాలని ప్రశ్నించారు. తాము సభలో సమైక్యాంధ్ర అనడం లేదన్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఇరు ప్రాంతాలు బాగుండాలని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని, అందులో తప్పేముందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా తాము వ్యతిరేకం కాదని అయితే, తమ ప్రాంత ప్రజలకు నీరు, విద్యుత్, ఉద్యోగాల విషయంలో స్పష్టత కావాలన్నారు.
తెలుగు జాతికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవిని అంటిపెట్టుకోవడం సరికాదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలో ఉంటే కాంగ్రెసు పార్టీ ఎంపీలు వెల్లోకి రారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితిలో అన్ని పార్టీల తప్పుందని, మళ్లీ పార్టీలే సద్దుమణిగేలా చేయాలన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నుండి తప్పులు జరిగాయన్నారు.
తాము తెలంగాణకు అన్యాయం చేయవద్దని చెబుతున్నామని, అదే సమయంలో తమ ప్రాంతానికి కూడా అన్యాయం జరగవద్దన్నారు. తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా పార్టీలో నిర్ణయం జరిగిందన్నారు. తమ ప్రాంతానికి న్యాయం జరగకుండా ఇచ్చే తెలంగాణ వద్దన్నారు. అదే సమయంలో తెలంగాణకు అన్యాయం జరిగినా నిలబడతామన్నారు. ఆంటోనీ కమిటీ వల్ల ప్రజా ఉద్యమం తగ్గలేదన్నారు. విడిపోతే బాగుండని తామనుకున్నామని కానీ సెంటిమెంటును గుర్తించాలన్నారు. కాగా ఉభయ సభలు రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.