సొమ్మసిల్లినా పట్టదా: నామా, కెసిఆర్కు బెదిరింపు ఫోన్స్
ఈ రోజు టిడిపి ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్లు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వెల్లోకి దూసుకెళ్లారు. కాసేపటికి వెల్ వద్దనే సిఎం రమేష్ సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం కాసేపటికి సభ తిరిగి ప్రారంభమైంది. అప్పుడు కూడా సిఎం రమేష్ కూర్చుని నిరసన తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న నేపథ్యంలో లోకసభ, రాజ్యసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
సభ వాయిదా పడిన అనంతరం సిఎం రమేష్ మాట్లాడుతూ... తెలుగు ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామన్నారు. యూపిఏ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు. ఆంటోనీ కమిటీతో ఒరిగేదేమీ లేదన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిఎం రమేష్కు ఫోన్ చేసి పరామర్శించారు.
పార్టీ కమిటీ: గాలి
ఆంటోని కమిటీ కాంగ్రెసు పార్టీ కమిటీ తప్ప ప్రభుత్వ కమిటీ కాదని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాదులో విమర్శించారు. ఆంటోని కమిటీ చట్టబద్ధమైనది కాదన్నారు. ఆ కమిటీకి సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు.
గవర్నర్ను కలిసిన తెరాస ఎమ్మెల్యేలు
తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెరాస ఎమ్మెల్యేలు గవర్నర్ నరసింహన్, డిజిపి దినేష్ రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గవర్నర్ను, డిజిపిని వారు కలిశారు.
కెసిఆర్కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాము ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆయనకు భద్రత కల్పించాలని కోరామన్నారు. బెదిరింపు కాల్స్కు పాల్పడిన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను పాలించే నైతిక హక్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పెట్టిన ఆంక్షలు ఇప్పుడు ఎందుకు అమలు చేయరన్నారు. ప్రభుత్వం పక్షపాతం వైఖరి అవలంభిస్తోందన్నారు.