హైద్రాబాద్ వస్తున్నా, చెప్పండి: ఫేస్బుక్లో నరేంద్రమోడీ
ఈ నేపథ్యంలో రాష్ట్ర యువతతో సామాజిక వెబ్ సైట్లలో మన రాష్ట్ర యువతతో కలిసి హల్ చల్ చేస్తున్నారు. మిమ్మల్ని కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నానని, యువభేరీలో సదస్సులో ప్రసంగిస్తానని, వివిధ సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మీ అభిప్రాయాలు చెప్పాలని మోడీ కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
దానికి అనూహ్య స్పందన వచ్చింది. నలభై వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దాదాపు నాలుగు వేల మంది వరకు స్పందించారు. అవినీతి, రాష్ట్ర విభజన అంశం, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలని మోడీకి పలువురు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యువతకు మోడీ ఫేస్బుక్లో నివాళులు అర్పించారు.
మోడీ సభకు అనుమతివ్వవద్దు
మోడీ హైదరాబాదులో ప్రవేశించకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 11 మోడీ హైదరాబాద్ వస్తున్నారని, ఈ కార్యక్రమానికి రాకుండా పోలీసులను ఆదేశించాలని ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
కాగా మోడీ 11న ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు వస్తారు. అక్కడి నుండి లేక్ వ్యూ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకొని అనంతరం.. ఓ సంస్థ నిర్వాహకులతో ప్రయివేటు హోటల్లో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు నవభారత యువభేరీ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఆరున్నర గంటలకు నారాయణగూడలోని కేశవ మెమోరియల్ పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఆవిష్కరించి రాత్రి బయలుదేరుతారు. కాగా మోడీ సభలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో వలె త్రిడి టెక్నాలజీని ఉపయోగించనున్నారు.