విభజనతోనే టిఆర్ఎస్ విలీనం!: రాజకీయమేనన్న బాబు

ఓట్లు, సీట్ల లెక్కలు తప్ప ప్రజల ఆవేదన పట్టించుకోరా అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ నిర్ణయం తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి వచ్చిందని రాజ్యసభలోను అందరూ విమర్శించాలని బాబు అన్నారు. కేంద్రమంత్రి చిదంబరం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైన ఆయనకు అసలు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీలోని ఐదో చాప్టర్ను అమలు చేస్తున్నామని చిద్దూ చెబుతున్నారని, అదే జరిగితే మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నారు.
విభజన తీరును తెలంగాణ కోసం ఉద్యమించిన సిపిఐ, బిజెపిలు కూడా తప్పు పట్టాయన్నారు. కాంగ్రెసు పార్టీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప ప్రజల ఆవేదనను పట్టించుకోవడం లేదన్నారు. విభజన కాంగ్రెసు పార్టీ సొంత వ్యవహారం కాదన్నారు. విభజనపై ప్రెస్ మీట్లో చెప్పిన డిగ్గీ, అదే సమయంలో తెరాస విలీనం గురించి ప్రస్తావించారని, ఆ తర్వాత బెంగళూరులో తెలంగాణ ఇస్తే పద్నాలుగు సీట్లు ఇస్తామని చెప్పారని ఇది ఓట్లు, సీట్ల రాజకీయం కాదా అని ప్రశ్నించారు.
అదే డిగ్గీ మళ్లీ తెలంగాణపై టిడిపి వెనక్కి వెళ్లినా తాము వెళ్లలేదన్నారు. విభజనపై సొంత పార్టీలోనే కాంగ్రెసు పార్టీ ఏకాభిప్రాయం తీసుకు రాలేదన్నారు. రెండు ప్రాంతాలలోను ఆ పార్టీ నేతలే విభజనపై రెచ్చగొడుతున్నారన్నారు. రెండు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెసు నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు టిడిపి హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు.
తెలంగాణను మిగిలిన వాటితో పోల్చలేమన్నారు. విడిపోయే పరిస్థితి వస్తే అందరికీ సమ న్యాయం చేయాలన్నారు. అలాంటి ప్రయత్నాన్ని కాంగ్రెసు పార్టీ ఎందుకు చేయలేదన్నారు. ప్రస్తుత పరిస్థితికి డిగ్గీయే కారణమన్నారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడు టిడిపిని దృష్టిలో పెట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. దేశ రాజధాని ఉన్న ప్రాంతం ఇప్పటి వరకు ఎప్పుడూ విడిపోలేదన్నారు.
ఈ కారణంగానే తాము కొత్త రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు అడిగితే దిగ్విజయ్ సింగ్ ఎగతాళి చేశారన్నారు. టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలీనం, సీట్లు పెంచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెసు పార్టీ ముందుకు పోతోందన్నారు. విభజన విషయమై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని తాము పార్లమెంటులో పోరాటం చేస్తున్నామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెసు పార్టీకి తెలంగాణ గుర్తుకు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications