పార్టీల లేఖలతోనే నిర్ణయం, అపేది లేదు: టీపై డిగ్గీ

రాజకీయ పార్టీలు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇచ్చాయని, ఆ తర్వాత హోం మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలోనూ అభిప్రాయాలు చెప్పాయని, వాటి ఆధారంగానే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వంద శాతం ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపేది లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సంప్రదింపులకు ప్రభుత్వ కమిటీ అవసరం లేదని ఆయన చెప్పారు. తమ పార్టీ శ్రేణులకు నచ్చజెప్పడానికి మాత్రమే ఆంటోనీ కమిటీని వేశామని ఆయన చెప్పారు.
ఆంటోనీ కమిటీ రేపు, ఎల్లుండి కేంద్ర మంత్రులతోనూ, తమ పార్టీ పార్లమెంటు సభ్యులతోనూ మాట్లాడుతుందని చెప్పారు. ఎన్టీవోలు, విద్యార్థులు, రాజకీయేతర సంఘాల ప్రతినిధులు ఆంటోనీ కమిటీని కలిసి అభిప్రాయాలు చెప్పవచ్చునని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున కమిటీ హైదరాబాద్ వెళ్లలేదని, కమిటీకి అభిప్రాయాలు చెప్పదలుచుకున్నవారు బొత్స సత్యనారాయణను సంప్రదించాలని ఆయన అన్నారు.
విభజనకు అంగీకరించినప్పటికీ విభజన విధివిధానాలపై స్పష్టత ఇవ్వలేదని ఇతర రాజకీయ పార్టీలు అంటున్నాయని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా - ముసాయిదా బిల్లు శానససభలో చర్చకు వస్తుందని, ఆ తర్వాత లోకసభలో, రాజ్యసభలో చర్చకు వస్తుందని, అప్పుడు రాజకీయ పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పవచ్చునని ఆయన అన్నారు. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి వెళ్తుందని, ఆ తర్వాత రాష్ట్ర శానససభకు వెళ్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై అందరి సందేహాలూ తీరుస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ ముందుకు వెళ్లాల్సి ఉందని, ఎన్జీవోలు సమ్మెను విరమించాలని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. విభజనపై ఆందోళనలు చేస్తే అది సిడబ్ల్యుసి నిర్ణయానికి వ్యతిరేకింగా వెళ్లినట్లవుతుందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆందోళన చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications