కూర్చోబెట్టి మాట్లాడాలి: శీలం, సమన్యాయమంటే..: చిరు
ప్రజల తరఫున వారి అభిప్రాయాలను అదిష్టానానికి చెబుతున్నామన్నారు. శాసన సభ్యులతో మాట్లాడిన తర్వాత మరోసారి చర్చించే అవకాశాన్ని తమకు ఇవ్వాలని కోరామన్నారు. కాగా హైదరాబాదులో ద్వితీయశ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి సీమాంధ్రులకు రానివ్వవద్దని, రాజధానిని కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని కేంద్రమంత్రులు ఎకె ఆంటోనీ కమిటీకి కేంద్రమంత్రులు విన్నవించుకున్నారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా సీమాంధ్ర ప్రజలను శాంతపరిచే విధంగా ఏదో విధాన ప్రకటన చేయాలని వారు మొర పెట్టుకున్నారు. వారు సీమాంధ్రుల ఆందోళనను కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నెల 30లోగా సీమాంధ్రులను శాంతపర్చేలా విధాన ప్రకటన చేయాలని కోరారు. భాగ్యనగరంతో వారి భావోద్వేగాలు ముడివడి ఉన్నాయని, దానిని కోల్పోవడం వారు జీర్ణించుకోలేరన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం అంతకంతకు పెరుగుతోందని తెలిపారు. నాయకత్వం లేకుండానే రోజు సుమారు నాలుగైదు లక్షల మంది రోడుల మీదకు వస్తున్నారని, ప్రస్తుతం ఎపిఎన్జీవోలు సమ్మె మొదలుపెట్టడం వల్ల ఉద్యమ తీవ్రత మరింత పెరిగే అవకాశముందన్నారు. గురువారం రాత్రి సుమారు గంటన్నర పాటు కమిటీ సభ్యులైన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్లతో కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. ఒక కిల్లి కృపారాణి మాత్రం హాజరు కాలేదు. కాగా తెలంగాణ ఆపేది కాదని ఆంటోనీ కేంద్రమంత్రులకు స్పష్టం చేశారు.
ప్రజలందరికీ సమన్యాయం చేయాలని కోరినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చెప్పారు. సమన్యాయం అంటే విభజన తర్వాత హక్కుల్లో న్యాయం కోసం అడుగుతున్నారా అని విలేకరులు ప్రశ్నిస్తే.. 'నో.. నో.. మీరు అలా వక్రీకరించవద్దు. సమన్యాయం అంటే ఎవరికీ అన్యాయం జరగకూడదని అర్థం' అని చిరు అన్నారు.