ప్రసంగాల్లో లేని టి, అసంతృప్తి: వేడుకలకు విభజన సెగ

Manmohan Singh - Pranab Mukherjee
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో గాని, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో గాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన లేకపోవడం తెలంగాణ ప్రజలను, నాయకులను నిరుత్సాహానికి గురి చేసిందని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేతలు వినోద్ కుమార్, నాయిని నర్సింహా రెడ్డిలు గురువారం అన్నారు.

గతంలో ఎన్డీయే ప్రభుత్వం చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు ఎర్రకోట నుండి ప్రకటన చేసిందని గుర్తు చేశారు. కేంద్రం ఇలా ఓ ప్రకటన చేసి ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఓ వైపు సీమాంధ్రకు చెందిన వళ్లు తెలంగాణ ప్రకటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. ఈ ప్రాంత కాంగ్రెసు నేతలు సంబరాల్లో మునిగితేలటం సరికాదన్నారు.

వేడుకల్లో విభజన సెగలు

రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా విభజన సెగలు కొనసాగాయి. ఏకంగా రాజ్ భవన్, గాంధీ భవన్, పెరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా నిరసనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన పంద్రాగస్టు పరేడ్‌లో పాల్గొన్న సీఎంకు తెలంగాణ సెగ తగిలింది. గౌరవ వందనం స్వీకరించడానికి ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెళుతుండగా ఓ వ్యక్తి 'జై తెలంగాణ' అని రాసి ఉన్న బ్యానర్‌ని ప్రదర్శించాడు.

రాజ్ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులోనూ తెలంగాణ, సీమాంధ్ర నేతలు వర్గాలుగా చీలిపోయారు. ఇరు ప్రాంతాల నేతలు ఎడమొహం, పెడమొహంగా వ్యవహరించారు. రాజ్‌భవన్‌లోని లాన్‌లో గవర్నర్‌తో పాటు ప్రముఖులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సీట్లలో ఇరు ప్రాంతాల నాయకులు వేర్వేరుగా ఆసీనులయ్యారు.

గవర్నర్‌కు ఇరువైపులా ముఖ్యమంత్రి కిరణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సేన్‌గుప్తా కూర్చోగా.. సిఎం పక్కనే శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సీమాంధ్ర మంత్రులు ఆనం రామనారాయణ, పితాని సత్యనారాయణ, శైలజానాథ్ కూర్చున్నారు.

అయితే తెలంగాణ నేతలైన పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు మరోవైపున ఏర్పాటు చేసిన సీట్లలో ఒకే చోట కూర్చున్నారు. గాంధీ భవన్‌లోనూ తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు వినిపించాయి.

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రసంగం ముగియగానే అక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో పిసిసి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణరాజు 'జై ఆంధ్రప్రదేశ్' అంటూ నినాదాలిచ్చారు. అక్కడే ఉన్న సీఎం కిరణ్, బొత్స దీన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+