భర్తను చూడబోతే లిక్కర్ తాగించి రేప్ చేశారు
హౌరా: కరెక్షన్ హోమ్లో విచారణ ఖైదీగా ఉన్న భర్తను చూడడానికి వెళ్లిన మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లోని హౌరాలో జరిగింది. అత్యాచారం చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ముప్పయి ఏళ్ల పడిలో ఉన్న మహిళ ఈ నెల 13వ తేదీన తన భర్తను చూడడానికి కరెక్షనల్ హోమ్కు వెళ్లింది. అయితే, తగిన పత్రాలు లేకపోవడంతో భర్తను కలవలేకపోయిందని పోలీసులు చెప్పారు. తాము సహాయం చేస్తామంటూ నలుగురు వ్యక్తులు వచ్చి ఆమెను జైలు వెలుపల ఉన్న ఓ గదికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపారు.
గదిలో ఆమె అచేతనావస్థలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి, తమకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. తనకు మద్యం తాగించి, తనపై అత్యాచారం చేసినట్లు మహిళ తన వాంగ్మూలంలో చెప్పింది. దాంతో పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేశారు.
అత్యాచారం చేసినవారిలో ఓ మైనారిటీ కూడా ఉన్నాడు. దీంతో అతన్ని జువనైల్ కోర్టుకు పంపించారు. మిగతా ముగ్గురిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వారిని కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది.