నేతలకి ఫోన్లో హరికృష్ణ పరామర్శ, అద్వానికి టిడిపి సిడి
అద్వానీ, సోనియాకు సిడిలు ఇచ్చిన టిడిపి ఎంపీలు
సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలకు సిడిలు ఇచ్చారు. అనంతరం ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సుజనా చౌదరి, కొణకళ్ల నారాయణ తదితరులు పార్లమెంటు ప్రాంగణంలో మాట్లాడారు. సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు సభలో పోరాడుతామన్నారు. తమకు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు కంటే లైఫ్ సెక్యూరిటీ ముఖ్యమన్నారు.
రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు తమతో కలిసి సభలో పాల్గొన్నారని విమర్శించారు. ఈ రోజు ఏడుగురు ఎంపీలు వచ్చారని, రేపు ఎందరు వస్తారో అన్నారు. సీమాంధ్రుల కోసం తాము సభలో ఉద్యమిస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్రులపై టిడిపికి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి సంక్షేమమే టిడిపి లక్ష్యమన్నారు. పార్లమెంటులో తాము ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రజల పక్షాన కేవలం టిడిపి మాత్రమే నిలబడగలదన్నారు. సీమాంధ్రకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.