నాదే ఫైనల్: హరికృష్ణ లేఖపై బాబు, చూస్తూ కోర్చోవాలా
త్వరలో తాను ప్రజల్లోకి ఆత్మగౌరవ యాత్ర పేరుతో వెళ్తున్నానని చెప్పారు. తెలుగు జాతి విధ్వంసాన్ని అరికడతానన్నారు. కేంద్రం అనుబంధాలు పెంచాలే తప్ప విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇరు ప్రాంతాల మధ్య రెచ్చగొడుతుంటే చూస్తూ కూర్చోవాలా అని మండిపడ్డారు. విభజన ద్వారా ఇరు ప్రాంతాల్లో ఓట్లు దండుకునే ప్రయత్నాలను, కుయుక్తులను కాంగ్రెసు పార్టీ చేస్తోందన్నారు.
తాము ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడానికి ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీతో లాలూచీ పడే సమస్యే లేదన్నారు. ఆ పార్టీతో లాలూచీ పడేందుకు తనకేమైనా బెయిల్ కావాలా లేక కేసులు నుండి తప్పించుకోవాలా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు.
తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని చెప్పిన కాంగ్రెసు పార్టీ మళ్లీ చర్చలు ఎందుకు జరుపుతోందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ డ్రామాలకు సామాన్యులు బలి అవుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కాగా, చంద్రబాబు ఈ నేల 25న లేదా 29న ఆత్మగౌరవ యాత్ర చేపట్టనున్నారు.