దేనికైనా రె'ఢీ': సమైక్యం కోసం కిరణ్ పదవీ త్యాగం!?
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే తాను ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ఆంటోని కమిటీకి చెప్పనున్నారని సమాచారం. తాను ఎట్టి పరిస్థితుల్లో విభజనకు అంగీకరించేది లేదని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా అంగీకరించరని వారికి తేల్చి చెప్పనున్నారు.
సిడబ్ల్యూసి నిర్ణయం వెలువడినప్పటి నుండి సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో ఉద్యమం రోజు రోజుకు జోరందుకుంటోందని, విభజనకు అనుకూలంగానే ఉంటే కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయమని ఆయన చెప్పనున్నారట. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమని, దానిని తెలంగాణ ప్రాంతం వారికి ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పనున్నారని ప్రచారం సాగుతోంది.
అధిష్టానం కిరణ్ విజ్ఞప్తిని మన్నిస్తుందా?
విభజనపై ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పిన కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయంపై వెనక్కి వెళ్లే అవకాశాలు ఏమాత్రం లేవంటున్నారు. అయితే హైదరాబాదు పైన మాత్రం పునరాలోచన చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు. ఇప్పటికే హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి సీమాంధ్ర నేతలు ఒప్పుకుంటారు. కానీ, తెలంగాణ నేతల నుండి వ్యతిరేకత వస్తుంది.
కిరణ్ విజ్ఞప్తి చేసినా విభజనపై కాంగ్రెసు వెనక్కి తగ్గనప్పటికీ హైదరాబాదు విషయంలో మాత్రం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. అదే సమయంలో హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో ఆందోళనకారులు శాంతించేందుకు ఏం చేయాలనే విషయమై కూడా కిరణ్తో పెద్దలు చర్చించే అవకాశాలున్నాయని సమాచారం.