కొత్తపార్టీతో పోరాటం: వీరశివా, కెసిఆర్పై అశోక్ నిప్పులు
సమైక్యాంధ్ర తప్ప తాము మరో దానిని అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. అన్ని వర్గాలు సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, ఉద్యోగులు కూడా ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు.
శిలాశాసనం కాదు: కొండ్రు మురళి
సిడబ్ల్యూసి నిర్ణయం శిలా శాసనం కాదని మంత్రి కొండ్రు మురళి ఢిల్లీలో అన్నారు. సీమాంధ్ర ప్రజలు కాంగ్రెసు పార్టీ పైన నమ్మకం ఉంచాలని, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. హైదరాబాదు అభివృద్ధిలో సీమాంధ్రుల భాగస్వామ్యముందన్నారు.
కెసిఆర్పై అశోక్ బాబు నిప్పులు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విశాఖలో నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ఉద్యమించింది ప్రజలుకాదని విజయనగరంలో పుట్టిన కెసిఆర్ అని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్ ఉద్యమాన్ని తీసుకు వచ్చారని, ఆయన రాష్ట్రాన్ని అమ్ముకు తిందామనుకుంటున్నారా అని మండిపడ్డారు. తెలుగు మాట్లాడే వారంతా కలిసుండాలనేదే తమ ఆకాంక్ష అన్నారు.
మనది భార్యా భర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధమన్నారు. అబద్దాలతో తెలంగాణ ఉద్యమం నడిచిందన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా గాంధీ విభజన చేశారన్నారు. సమైక్యాంధ్ర కోసమే తమ ఉద్యమం అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం సీమాంధ్రులు రక్తం దారపోశారన్నారు. సిడబ్ల్యూసి తమను అడిగితే సమైక్యనే కోరేవాళ్లమన్నారు.
హైదరాబాదు లేకుండా తాము ఊహించుకోమని, అది ఏ ఒక్కరి సొత్తు కాదని, రాష్ట్ర రాజధాని అని గుర్తు పెట్టుకోవాలన్నారు. సమ్మె తమకు కల్పించిన రాజ్యాంగ హక్కు అని, తమకు జీతం కంటే జీవితాలు ముఖ్యమన్నారు. ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉండమన్నారు. కాగా, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సిఎస్కు సమ్మె నోటీసు ఇచ్చారు. వచ్చే నెల 2వ తేది నుండి వారు సమ్మెకు దిగనున్నారు.