ఆత్మగౌరవ యాత్ర ఖరారు: బాబు టి వివరణపై సస్పెన్స్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 25వ తేది నుండి బాబు విశాఖ జిల్లా కొత్త వలస నుండి తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో ఆయన ప్రధానంగా అధికార కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు కుమ్మక్కయ్యాయని, టిడిపిని ఇరుకున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలకు చెప్పనున్నారని సమాచారం.
25వ తేదిన చంద్రబాబు విశాఖ విమానాశ్రయం నుండి బయలుదేరి విశాఖ నార్త్, పెందుర్తి మీదుగా కొత్త వలసకు చేరుకుంటారు. అక్కడ భారీ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం తన ఆత్మగౌరవ యాత్రను ప్రారంభిస్తారు. బాబు యాత్ర కోసం జిల్లా నేతలు కసరత్తు చేస్తున్నారు. యాత్ర పైన, విభజన అంశంపై తెలంగాణ, సీమాంధ్రకు చెందిన నేతలతో బాబు రేపు, ఎల్లుండి వేర్వేరుగా సమావేశం కానున్నారు.
ఇటీవల పార్టీని విభజన అంశం ఓ కుదుపుకుదుపుతున్న విషయం తెలిసిందే. సీమాంధ్ర కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సమైక్యాంధ్ర అంటుండగా.. టిడిపి మాత్రం తెలంగాణపై బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి సీమాంధ్రకు న్యాయం అంటూ ఆందోళనలు చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు విభజనకు తాము వ్యతిరేకం కాదని చెబుతూ తమ ప్రాంతానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీమాంధ్ర ప్రాంతంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు దీక్షలు చేస్తున్నారు. సీమాంధ్రలో దీక్షలు చేస్తున్న ఆ పార్టీ నేతలు కొందరు సమైక్యవాదం వినిపిస్తున్నారు. బుధవారం నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్రకు మద్దతుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనిపై బాబు స్పందిస్తూ.. విభజన విషయంలో తాను చెప్పిందే తుది నిర్ణయమన్నారు. తద్వారా టిడిపి తెలంగాణకు కట్టుబడి ఉందని చెబుతున్నారు.
బాబు ఇప్పుడు సీమాంధ్రలో తన యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని చెప్పడంతో పాటు విభజన విషయంలో ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రజలు సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేస్తే తన వివరణపై ఆయన స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దానిని సమైక్యవాదులు ఏ మేరకు ఆహ్వానిస్తారనేది ప్రశ్నే. మొత్తానికి బాబు ఏం చెబుతారని, ఎలా కన్విన్స్ చేస్తారనేది సస్పెన్స్గా మారింది. మరోవైపు మంత్రి కొండ్రు మురళీ బాబుకు ధీటుగా యాత్ర చేస్తామని ప్రకటించారు.