హరికృష్ణ రాజీనామా ఆమోదం: వారిపై మరింత ఒత్తిడి
కాగా, హరికృష్ణ రాజీనామా ఆమోదం నేపథ్యంలో కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యుల పైన ఒత్తిడి పడిందనే చెప్పవచ్చు. ఇప్పటికే సీమాంధ్రలో ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ సమైక్యవాదులు ఒత్తిడి తెస్తున్నారు. సమైక్యాంధ్ర కోసమంటూ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేశారు.
అయితే, హరికృష్ణ రాజీనామాను మాత్రం ఈ రోజు ఆమోదించారు. తద్వారా కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రుల పైన సమైక్యవాదులు మరింత ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా ఆమోదంతో ఒత్తిడిలో పడట్లుగానే భావించవచ్చు.
సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో రాజీనామాలు చేయాలా? వద్దా? చేస్తే ఏమవుతుందోననే ఆందోళన వారిలో ఏర్పడిందని చెప్పవచ్చు. రాజీనామా చేయకుంటే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమైక్యాంధ్ర కోసం మీ అన్న రాజీనామా చేస్తే మీరెందుకు మాట్లాడటం లేదని పురంధేశ్వరిని, పదవుల కోసం సమైక్యాన్ని వదులుకున్నారంటూ చిరంజీవి, కావూరి సాంబశివ రావు వంటి నేతల పైన ఇప్పటికే సమైక్యవాదులు మండిపడుతున్నారు.
తొలి రాజీనామా
సమైక్యాంధ్ర కోసం ఆమోదం పొందిన తొలి రాజీనామా హరికృష్ణది. రాజీనామా ఆమోదంపై హరి స్పందిస్తూ... తాను ప్రజల మనిషినని, ఆమోదించినందుకు చైర్మన్కు కృతజ్ఞతలు అన్నారు. తాను తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని అన్నారు.