రేప్ జీవితాన్ని అంతం చేయదు, విధుల్లో చేరుతా: విక్టిమ్
ముంబై: అత్యాచారం జీవితాన్ని అంతం చేయలేదని, ఈ ఘటనతో జీవితమేమి ముగిసిపోదని ముంబై జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముంబై అత్యాచార బాధితురాలు ఆత్మస్థైర్యం ప్రదర్శిస్తున్నారు. శనివారం తనను కలిసి పరామర్శించేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సమంత్ ప్రభావాల్కర్తో ఆమె సందేశాన్ని పంపించారు.
అత్యాచార ఘటనతో తన జీవితం అంతం కాకూడదని, నేరస్థుల్ని కఠినంగా శిక్షించాలని, వీలైనంత త్వరగా కోలుకొని, మళ్లీ విధుల్లో చేరాలనుకుంటున్నానని ఆమె సందేశం పంపించారు. ఇటీవల ముంబైలో మహిళా ఫోటో జర్నలిస్టు పైన సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
మరోవైపు కేసును పర్యవేక్షిస్తున్న హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి దర్యాప్తు ప్రగతిపై ఆరా తీశారు. అత్యాచార సంఘటనను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. ఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రాన్ని ప్రారంభించాక ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఈ సంఘటనపై లోక్సభలోనూ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. నిర్భయ నిధికి ప్రకటించిన రూ.వెయ్యి కోట్లలో నేటికీ పైసా కూడా విడుదల చేయలేదని బిజెపి సభ్యుడు గోపీనాథ్ ముండే సర్కారును నిలదీశారు. కఠిన చట్టం చేసినా మహిళలపై నేరాలు ఆగడంలేదని స్వతంత్ర ఎంపి జయప్రద ఆవేదన వెలిబుచ్చారు.
కాగా, మహారాష్ట్రలో నేరాల పెరుగుదలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే కారణమని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సమితి అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, రాజీవ్ శుక్లా ఖండించారు. ప్రముఖ నటి షబానా అజ్మీ కూడా కోల్కాతాలో ఇదే విధంగా అన్నారు. అలాగే మైనర్ నేరగాళ్ల అంశాన్ని ఇంకా తేల్చకపోవడమేమిటని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి అన్నారు. ఆ వయసు ఉగ్రవాదులను పాకిస్థాన్ ఉసిగొల్పితే మైనర్లన్న పేరిట వారిని వదిలేద్దామా? అని నిలదీశారు.