జగన్ కేసు: మంత్రి గీతారెడ్డికి షాక్, సిబిఐ సమన్లు
అనంతపురం జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన లేపాక్షి నాలెడ్జి హబ్ ప్రాజెక్టు విషయంలో సిబిఐ గీతారెడ్డికి ఆ సమన్లు జారీ చేసింది. రేపు గానీ ఎల్లుండి గానీ సిబిఐ అధికారులు గీతారెడ్డిని విచారించే అవకాశం ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ జీవోల విషయంలో సిబిఐ ఆమెను ప్రశ్నించనుంది.
వైయస్ జగన్ కేసులో మోపిదేవి వెంకటరమణ అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అరెస్టయిన తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ కేసులో మరో ఇద్దరు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ నిందితులుగా చేర్చింది. చాలా రోజులు మంత్రులుగా కొనసాగిన వారిద్దరు చివరికి రాజీనామా చేశారు.
వైయస్ జగన్ కేసులో మొత్తం ఆరుగురు మంత్రులపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో ఇద్దరు మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్యలపై కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ ఇదివరకు విచారించింది. కన్నా లక్ష్మినారాయణను విచారించాల్సి ఉంది.