టిడిపి ఎంపీలకు కాంగ్రెస్ నేతల మద్దతు, సీమాంధ్ర భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు సోమవారం సంఘీభావం తెలిపారు. నలుగురు టిడిపి, ఎనిమిది మంది కాంగ్రెసు ఎంపీలను లోకసభ నుండి ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో టిడిపి ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద సోమవారం ఉదయం నుండి దీక్షకు దీగారు. వారి దీక్షకు కాంగ్రెసు ఎంపీలు సాయంత్రం సంఘీభావం తెలిపారు. టిడిపి ఎంపీలు సేవ్ ఆంధ్ర ప్రదేశ్, వి డిమాండ్ జస్టిస్ ఫర్ సీమాంధ్ర అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
కావూరి చాంబర్లో సీమాంధ్ర కాంగ్రెసు భేటీ
పార్లమెంటులోని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు చాంబర్లో సీమాంధ్ర కాంగ్రెసు కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమైక్యాంధ్ర అజెండాతో వారు విస్తృత చర్చలు జరిపారు.
ఢిల్లీకి డిప్యూటీ - రేపు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో ఉన్నారు.