డిగ్గీ పిలిస్తే రాలేదు: కెసిఆర్, జగన్ది మోసమని కెటిఆర్
ఆహార భద్రత బిల్లుపై ఓటు వేసేందుకు తాను రాలేదని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రిజిస్టర్లో సంతకం పెట్టి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వచ్చానని చెప్పారు. తెలంగాణ రావడం ఖాయమని, అందుకు శీతాకాల సమావేశాల వరకు కూడా వేచిఉండాల్సిన అవసరం లేకపోవచ్చునని తెలిపారు.
తెరాస నేత, ఎంపి వివేక్, పార్టీ జాతీయ నేత కె కేశవ రావు తదితరులతో కెసిఆర్ పార్లమెంటుకు వచ్చారు. తనకు ఎదురైన సిపిఎం నేత సీతారాం ఏచూరి, బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ, కాంగ్రెస్ ఎంపి సంజయ్ నిరుపమ్ తదితర నేతలతో పిచ్చాపాటీ మాట్లాడారు.
విలీనం ఒప్పందం లేదు: కెటిఆర్
తెలంగాణ వస్తే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే ఒప్పందమేదీ లేదని తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సోమవారం స్పష్టం చేశారు. ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాకాంక్షలు నెరవేర్చే బాధ్యత తమపైనే ఎక్కువగా ఉంటుందన్నారు. కాంగ్రెస్లో తెరాస విలీనంపై కెసిఆర్ ప్రకటన గురించి ప్రశ్నించగా విద్యార్థుల ఆత్మబలిదానాలు చూసి తట్టుకోలేక అవసరమైతే తెలంగాణ కోసం తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆనాడు ప్రకటించారని గుర్తు చేశారు.
పార్లమెంటులో బిల్లుపెట్టాక పరిస్థితిని బట్టి విలీనం గురించి యోచిస్తామన్నారు. అయితే, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇటు విభజన ప్రకటన చేసి, అటు సీమాంధ్ర నేతలతో ఉద్యమం నడిపిస్తోందని ఆరోపించారు. కమిటీల పేరిట మోసగించిన కాంగ్రెస్, మరోసారి అదే పని చేస్తే సహించబోమన్నారు.
జైలులో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణలోని ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు అన్యాయం చేశారన్నారు. సమన్యాయమంటే బయ్యారం గనుల అక్రమ కేటాయింపు, పోలవరం ప్రాజెక్టుతో 300గిరిజన గ్రామాలను నిలువునా ముంచడమేనా? అని ప్రశ్నించారు.