హైద్రాబాద్కి గడ్డుకాలమే: జగ్గారెడ్డి, తరిమేశారని ఎంపీలు
రేపు ఢిల్లీకి సచివాలయ ఉద్యోగులు
తాము రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాదులో చెప్పారు. ఆంటోని కమిటీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతామన్నారు. ప్రతిపక్ష నేతలను కూడా కలుస్తామన్నారు. మూడు రోజులుగా తాము విధులకు హాజరవుతున్నామని, భోజన విరామ సమయంలో మాత్రమే ఆందోళన చేస్తున్నామన్నారు.
దాడి చేయలేదు: సమైక్యాంధ్ర జెఏసి
తాము తెలంగాణ ఉద్యోగుల పైన దాడులు చేయలేదని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ప్రకటించింది. మార్ఫింగ్ చేసి తమను బద్నాం చేస్తున్నారన్నారు. కాగా, ఢిల్లీలోని ఎపిఎన్జీవో ఉద్యోగులు ప్రధానమంత్రితో పాటు బిజెపి, అన్నాడిఎంకె, టిఎంసి, సిపిఎం నేతలను కలిశారు.
మార్షల్స్తో తరిమేశారు: టిడిపి ఎంపీలు
తాము చిత్తశుద్ధితో పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటే మార్షల్స్ సహాయంతో తరిమి వేశారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్రం అగ్ని గుండంగా మారడానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కారణమన్నారు. కాంగ్రెసు పార్టీ తెలుగు వారి జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. సోనియా సీమాంధ్రకు శాశ్వత శత్రువుగా మిగిలి పోవద్దన్నారు. ఓట్లు, సీట్ల కోసమే విభజన అన్నారు.