జగన్ పార్టీలోకి ఇంకొందరు, జైల్లో ఏమవుతుందో: బొత్స
వాళ్లంతా ఆ పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ నుంచి వెళ్లి ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రయోజనాలు పూర్తవగానే వెనక్కి వచ్చారని.. ఇప్పుడు ఏమి ఆశించి మళ్లీ ఆ పార్టీలోకి వెళుతున్నారో చూడాలని ఎద్దేవా చేశారు. అన్ని రాజకీయపక్షాలు తెలంగాణకు అనుకూలమని చెప్పాకే కాంగ్రెస్ వైఖరి ప్రకటించిందన్నారు. ఇప్పుడు వారంతా తమకేమి తెలియదన్నట్టు వ్యవహరించడం వల్ల ప్రజలు బాధపడుతున్నారన్నారు.
జైల్లో లోపాయికారిగా ఏం జరుగుతోందో ఎవరికి తెలుసని బొత్స వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షపై సందేహాలు వ్యక్తం చేశారు. అసలు దీక్ష చేస్తున్నారో లేదో బయటకు ఎలా తెలుస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ను మహాత్మా గాంధీతో పోలుస్తూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడితో దోపిడీదారుడు, దొంగతనంగా ప్రజాధనం కొల్లగొట్టిన జగన్కు పోలికా అంటూ ఎద్దేవా చేశారు.
జగన్ లాంటి వ్యక్తిని మహాత్ముడితో పోలిస్తే ప్రజాస్వామ్యం నాశనమై పోతుందని దుయ్యబట్టారు. జగన్ ఏనాడైనా సమైక్య రాష్ట్రం కోసం ప్రయత్నించారా? అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు ప్రతిసారీ అంటున్న సమన్యాయానికి అర్థం ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఎపిఎన్జీవోలు హైదరాబాద్లో సమైక్య సభ పెట్టుకోవచ్చని బొత్స అన్నారు. చట్ట ప్రకారం వారికి అనుమతి ఇవ్వవచ్చని, దానికి లోబడి సభ జరుపుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అనుమతి ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.