సోనియా మాటిస్తే అంతే, పదేళ్లకే అంగీకరించాం: గీతారెడ్డి
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట ఇస్తే తిరుగు ఉండదని మంత్రి గీతా రెడ్డి బుధవారం అన్నారు. ఆమె నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర నేతలు మధ్యాహ్నం భేటీ అయ్యారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు పార్టీ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెసు జెండా ఎగురవేయాలని, తెలంగాణ విజయోత్సవ సభలు నిర్వహించాలని చర్చించారు.
అనంతరం గీతారెడ్డి విలేకరులతో మాట్లాడారు. సోనియా మాటిస్తే తిరుగుండదని, సిడబ్ల్యూసి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలకు ఆమె సూచించారు. తెలంగాణ ఇచ్చిందుకు సోనియాకు కృతజ్ఞతలు చెప్పేందుకు గ్రామగ్రామాన సభలు నిర్వహిస్తామని, అవసరమైనప్పుటు తాము ఆంటోని కమిటీని కలుస్తామని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం పెద్ద మనసుతో జరిగిందన్నారు.
తమకు పది జిల్లాల తెలంగాణ తప్ప మరొకటి అవసరం లేదన్నారు. విభజనపై రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. అధిష్టానం కూడా వెనక్కి తగ్గదన్నారు. విడిపోయిన తర్వాత కూడా సోదరులుగా కలిసిమెలిసి ఉందామన్నారు. సీమాంధ్ర ప్రజలు సంయమనంతోనే ఉన్నారని, ఉద్యోగులు శాంతిగా ఉండాలన్నారు.
సీమాంధ్రలో ఎపి ఎన్జీవోల సభపై స్పందిస్తూ... హైదరాబాదును పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా అంగీకరించిన వాళ్లం వారు సభ పెట్టుకుంటామంటే ఎలా వద్దంటామన్నారు. పార్లమెంటులో త్వరగా తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. ఆహార భద్రత బిల్లు పెట్టినందుకు సోనియాకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో మంత్రులు గీతా రెడ్డి, జానా రెడ్డి, బస్వరాజు సారయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు పాల్గొన్నారు.