రాజ్యసభ సవరణ: జైల్లో ఉన్నా ఎన్నికల బరిలో దిగొచ్చు
అయితే ఒక్క సవరణతో న్యాయస్థానం ఆదేశాలను సర్కారు పక్కన పెట్టింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రవేశ పెట్టిన ప్రతిపాదనలను రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. పైగా ఇది పార్లమెంటు ఆమోదం పొందాక తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలని సవరణలో పేర్కొంది. ఈ సందర్భంగా రాజకీయ నాయకులంతా నేరగాళ్లని రుజువు చేసేందుకు కోర్టులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.
చట్ట సవరణ ప్రకారం జైలు పక్షులు ఇకపై పోటీ చేయవచ్చునని తెలిపారు. ఈ హక్కును నిరాకరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా తప్పేనన్నారు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపే ఆదేశాలిచ్చే ముందు న్యాయవ్యవస్థ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాజకీయ నాయకులంతా నేరగాళ్లేనన్నది దేశ ప్రజల్లోని సహజ ప్రతికూల భావన అని, మనం అలాంటివాళ్లం కాకపోయినా, కోర్టులు మాత్రం ఇది నిజమేనని రుజువు చేసేందుకు అత్యుత్సాహం చూపుతున్నాయన్నారు.
'ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 62 కింద ఉప విభాగం(2) ప్రకారం అభియోగాలపై జైల్లో ఉన్న వ్యక్తికి ఓటు హక్కు ఉండదు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ, ఓటరు కాని వ్యక్తి పోటీకి అర్హుడు కాడ'న్నది తీర్పు సారాంశం. దీనిపై ప్రభుత్వం సమీక్ష పిటిషన్ కూడా వేసింది. కానీ, దానిపై విచారణ పూర్తి కాలేదు. అంతలోనే సవరణను ఎగువసభలో ఆమోదించారు. ఈ మేరకు అభియోగాలు రుజువై శిక్ష విధిస్తూ తీర్పు వచ్చేదాకా ఓటు హక్కుకు భంగం కలగని విధంగా చట్టానికి సవరణ చేశారు.