జగన్కోసం చరిత్ర మారుస్తారా?, వదులుకోం: విజయమ్మ
న్యూఢిల్లీ: తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం చరిత్రను మారుస్తారా? అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం ప్రశ్నించారు. జగన్ను దెబ్బతీసేందుకు, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా అని మండిపడ్డారు. విభజన తీరును నిరసిస్తూ ఆ పార్టీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
తెలుగు ప్రజలు హైదరాబాదును ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఆడుకుంటున్నాయన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. కానీ, ఇప్పుడు విభజనకు ఆయన పేరును ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అడ్డగోలుగా విభజిస్తూ వైయస్ పేరును ఎలా చెబుతారన్నారు. ఆయన ఎంత సమదృష్టి కలవారో అందరికీ తెలుసునన్నారు.

మనం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడగాల్సిన ప్రశ్నలను ఆయనే మనలను అడుగుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. కాంగ్రెసు, టిడిపి ప్రజాప్రతినిధులు, స్పీకర్ రాజీనామా చేస్తే సిడబ్ల్యూసి నిర్ణయం వెనక్కి వెళ్తుందన్నారు. రాష్ట్రం ఇప్పటికే అగ్ని గుండంలా మారిందన్నారు. ఇప్పుడు తెలుగు ప్రజలు ఎవరు సంతోషంగా లేరని, తెలంగాణలోను సమైక్యాంధ్ర కోరుకుంటున్నారన్నారు.
వైషమ్యాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలే కారణమన్నారు. విభజనపై అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. ఒక్క వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిందన్నారు. విభజన ద్వారా ఎలా న్యాయం చేస్తారో అధికార పార్టీ చెప్పాలన్నారు. తాను గుంటూరులో దీక్ష చేస్తే బలవంతంగా భగ్నం చేశారని, అందుకే జగన్ జైల్లో చేస్తున్నారన్నారు.
సిడబ్ల్యూసి ప్రకటన వచ్చిన మూడు రోజులకే తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాదును విడిచి వెళ్లిపోవాలంటున్నారని, హైదరాబాదును ఎందుకు వదులుకోవాలన్నారు. విడిపొమ్మనే వారికి రాజధాని ఇస్తారా? సమైక్యం కోరుకునే వారిని వెళ్లమంటారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా హైదరాబాదులోనే జరిగిందన్నారు.
జగన్ను అక్రమంగా జైలులో పెట్టారు
జగన్ను అక్రమంగా జైలులో పెట్టారని విజయమ్మ అన్నారు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. విలువలు, విశ్వసనీయత, మాట తప్పని వ్యక్తిని జైలులో పెట్టడం గర్హనీయమన్నారు. జగన్ కోసం కలిసున్న రాష్ట్రాన్ని విభజించి చరిత్ర మారుస్తారా అన్నారు.












Click it and Unblock the Notifications