ఎపిఎన్జీవోలు సభను రద్దు చేసుకోవాల్సిందే: శ్రీనివాసగౌడ్

విభజనకు సహకరించి తద్వారా వచ్చే సమస్యలు పరిష్కరించుకునేందుకు కలిసి వస్తే సభను కలిసే నిర్వహిద్దామని సూచించారు. సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై అక్కడే చర్చిద్దామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోతామని మీరంటున్నారని, ఎలా నష్టపోతారని ఆయన అడిగారు. అదంతా అపోహ మాత్రమేనని, కేవలం ఐదారు వేల మంది ఉద్యోగులు మాత్రం హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
సర్వీస్పరమైన సమస్యల సాధనకు అందరం కలిసే పోరాడుదామని, అవసరమైతే ఢిల్లీకి కూడా కలిసే వెళదామని, అంతే గానీ తమను రెచ్చగొట్టేలా మాత్రం వ్యవహరించవద్దని ఆయన అన్నారు. సెప్టెంబర్ 7 సభను మాత్రం రద్దు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. అదే రోజు తమ శాంతి ర్యాలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే జోనల్ వ్యవస్థ రద్దవుతుందని, సీనియారిటీ దెబ్బతింటుందని దుష్ప్రచారం చేస్తూ ఉద్యోగులను గందరగోళంలోకి నెడుతున్నారని మండిపడ్డారు.
విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు హైదరాబాద్లో పూర్తి రక్షణ ఉంటుందని, తాము కూడా సహకరిస్తామని, ఇందుకు తమ కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ సెల్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాము ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని సీమాంద్రులు చెప్పడాన్ని శ్రీనివాస గౌడ్ తప్పు పట్టారు. ఆస్తుల రక్షణకు చట్టాలు, ప్రభుత్వాలు ఉన్నాయని, తెలంగాణ వారి నుంచి ఏవైనా ఇబ్బందులుంటే తమకు ఫోన్ చేసిన కొద్ది సమయంలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
విభజన తర్వాత ఉద్యోగపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడం సరికాదని ఆయన అన్నారు. కలిసి కూర్చుని మాట్లాడుకుందామంటూ ఏపీఎన్జీవో నేతలను ఆహ్వానించారు. కలిసే సద్భావన యాత్రలు చేద్దామని సూచించారు. అయితే, సెప్టెంబర్ 7 సభతో ఏవైనా విపరిణామాలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications