రాష్ట్ర విభజన: అధిష్టానానికి సిఎం పరోక్ష హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయంపై పరోక్ష ధిక్కారం ప్రకటించారు. గురువారం సాయంత్రం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. నిర్ణయాలు తీసుకునేది పార్టీలు, ప్రభుత్వాలు కాదని, ప్రజలే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.
సమ్మెలు, నిరసనలు చట్టపరిధిలో చేసుకోవాలని ఆయన సూచించారు. సరైన నిర్ణయాలు తీసుకోనటువంటి పార్టీలకు, ప్రభుత్వాలకు ప్రజలు సెలవు ప్రకటించారని, అది మన ప్రజాస్వామ్యంలోని గొప్పదనమని ఆయన అన్నారు. ఒక వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యమని, ప్రభుత్వం గానీ పార్టీ గానీ ప్రజాశ్రేయస్సుకే పనిచేయాలని ఆయన అన్నారు.

నిర్ణయాలు తీసుకునేది ప్రజలు మాత్రమేనని, పార్టీలూ ప్రభుత్వాలూ కాదని, ఈ విషయాన్ని ఏ పార్టీ అధికారంలో ఉన్నా గమనించాలని ఆయన అన్నారు ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోనప్పుడు ప్రజలు వాటికి సెలవు ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు ప్రజల కోసమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. అందుకని పార్టీలు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.
త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని ఆయన తెలిపారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో రెండు వైపులా ఓ విధమైన వాతావరణం ఏర్పడి ఉందని, తెలుగు ప్రజల మనోభావాలకు అనుగుణంగా, తెలుగు ప్రజలు భవిష్యత్తు కోసం ముందుచూపుతో ముందుకు వెళ్లడానికి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో అది తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చాలా సున్నితమైన అంశమని, అందుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications