కారులో బాలికపై రేప్: తల్లి హత్య, తండ్రికి భయం
న్యూఢిల్లీ: హర్యానాలో ఓ దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసు పరిణామాలు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో గల హర్యానాలోని ఓ గ్రామ దళిత కుటుంబం తీవ్ర బాధ చెప్పనలవి కాకుండా ఉంది. వివరాల్లోకి వెళ్తే - నిరుడు ఆగస్టు 6వ తేదీన హర్యానాలోని చోటీకలాసిలోని 15 ఏళ్ల బాలికను పలుకుబడి గల వ్యక్తి కుమారులు అపహరించి, కారులో తెరిపి లేకుండా ఆమెపై అత్యాచారం చేశారు.
అత్యాచారం చేసిన తర్వాత ప్రతి పది రోజులకు ఓసారి తమ వద్దకు రావాలని, లేదంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని నిందితులు బాలికను బెదిరించారు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. తల్లి తండ్రికి చెప్పింది. దీంతో కటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. విషయం తెలిసిన పాఠశాల ప్రిన్సిపాల్ ఆ అమ్మాయికి తగిన పునరావాసం కల్పించి, భరోసా ఇవ్వడానికి బదులు పాఠశాల రోల్స్ నుంచి ఆమె పేరును తొలగించారు.
ఆ తర్వాత నెల రోజుల లోపే దుండగులు బాధితురాలి తల్లిని కిడ్నాప్ చేసి కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. తన కూతురిపై జరిగిన అత్యాచారంపై, తన భార్య హత్యపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్కు వెళ్లాడు. పోలీసులు అతని ఫిర్యాదును చించేశారు. దాంతో అతను కర్నాల్లోని భూటానా పోలీసు స్టేషన్కు వెళ్లి నిరుడు సెప్టెంబర్ 24వ తేదీన ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు నవంబర్ 1వ తేదీన చార్జిషీట్ దాఖలు చేశారు.
అయితే, అంతటితో వారి బాధ తీరలేదు. అగ్రకులానికి చెందినవారు తండ్రిని, కూతురిని బెదిరిస్తూ వచ్చారు. కేసును ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తూ వచ్చారు. దీంతో రక్షణ కోరుతూ తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుపై సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది. సమాజంలో, శాంతిభద్రతల యంత్రాంగంలో ఏదో తెగినట్లు కనిపిస్తోందని, అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.