జగన్ గతే తెరాస నేతలకు, జైల్లోనా రాజకీయం: బాబు
గుంటూరు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని చేతికందినంత దోచుకుని దోపిడీ దొంగల్లా తయారయ్యారని, వీరిని కూడా విచారిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు పట్టిన గతే పడుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాు నాయుడు అన్నారు. ఆర్థిక నేరస్థుడైన జగన్ జైల్లో రాజకీయ కార్యక్రమాలు చేయడం విడ్దూరంగా ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం మారడం ఖాయమని చంద్రబాబు అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని తెరాస నాయకులు దోపిడీ దొంగలుగా మారి చేతికి అందినంత దోచుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా చంద్రబాబు గుంటూరు జిల్లాలో తెలుగు జాతి ఆత్మగౌరవ పేరుతో బస్సు యాత్ర చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెరాస, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై దుమ్మెత్తిపోశారు.
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను భూస్థాపితం చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెరాస కాంగ్రెస్లో కలిసిపోయిందన్నారు. తెలంగాణపై తామ యూ టర్న్ తీసుకున్నామంటున్నారని, తనది ప్రజా టర్నే తప్ప వేరే టర్న్ కాదన్నారు. తెలుగు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల కోసం కాంగ్రెసు పార్టీ తెలుగువారి మధ్య చిచ్చు పెట్టిందని, తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటుందోని చంద్రబాబు మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సోనియాగాంధీ పెంపుడు కుక్కలని, తన మీద మొరుగుతారే కానీ, సోనియాని అడగలేరని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తామని మరోసారి చంద్రబాబు తెలిపారు.