సీమాంధ్రలో ఒక్క సీటు కూడా రాదు: కిరణ్ రెడ్డి
న్యూఢిల్లీ: ఆంటోనీ కమిటీ ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెసుకు సీమాంధ్రలో ఒక్క సీటు కూడా రాదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు నాయకులు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని ఆయన చెప్పారు. ఈ స్థితిలో రాష్ట్ర విభజనపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఆంటోనీ కమిటీకి చెప్పారు. మంగళవారం కాంగ్రెసు వార్ రూంలో ఆయన ఆంటోనీ కమిటీకి తన వాదనను వినిపించారు.
గత 35 రోజులుగా సీమాంధ్రలో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారని, ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ప్రజలంతా కాంగ్రెస్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన కమిటీ దృష్టికి తెచ్చారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ప్రజలను ఒప్పించే స్థితిలో లేడని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారంటే తమ నిర్ణయం గురించి అధిష్ఠానం పునరాలోచించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. 'ప్రజలు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? దానికి కారణాలేమిటి? ఆ కారణాలను ఎలా పరిష్కరించగలం అని ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నాం, ప్రజల మనోభావాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదు' అని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
జలవనరులు, ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాలు మొదలైన అనేక సమస్యల గురించి ఆయన వివరించినట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ఒక అధికారిక యంత్రాంగం ద్వారా ప్రయత్నించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
పార్టీలు వైఖరి మార్చుకున్నాయి...
తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమ వైఖరులను మార్చుకున్నాయని ఆయన చెప్పారు. తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, సోనియాను విమర్శిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లారని, మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల యాత్ర ప్రారంభించారని, వీరిద్దరి మధ్య కాంగ్రెస్ ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో పడిందని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఆంటోనీ కమిటీతో కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు గంట సేపు చర్చలు సాగించారు.












Click it and Unblock the Notifications