రాక్షసులమా?: కోదండ, మాకే హక్కులేదా: మందకృష్ణ
హైదరాబాద్: ఎపిఎన్జీవో సభకు అనుమతిచ్చిన ప్రభుత్వం, తెలంగాణ వారి శాంతి ర్యాలీకి అనుమతివ్వక పోవడం దారుణమని, తామేమైనా రాక్షసులమా అని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం అన్నారు. శాంతి ర్యాలీకి అనుమతిని ఇప్పించే బాధ్యతను మంత్రి జానా రెడ్డికి అప్పగించామన్నారు. తమ శాంతి ర్యాలీకి అనుమతి రాకుంటే అందుకు తెలంగాణ మంత్రులదే బాధ్యత అన్నారు.
శాంతి ర్యాలీకి అనుమతివ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తెలంగాణపై కుట్ర చేస్తే ప్రజలు తిరగబడతారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను ఆపలేరన్నారు. ముఖ్యమంత్రి వైఖరి వల్లనే శాంతిభద్రతలకు రాష్ట్రంలో విఘాతం కలుగుతున్నాయన్నారు. ఎపిఎన్జీవోల సభకు అనుమతి రావడం ముఖ్యమంత్రి పనే అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న కిరణ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మత విద్వేషాలు అంటూ వారికెలా ఇచ్చారు: శ్రీనివాస్ గౌడ్
శాంతి ర్యాలీకి అనుమతిస్తే మత విద్వేషాలు పెరుగుతాయని అనుమతివ్వని ప్రభుత్వం ఎపిఎన్జీవోల సభకు ఎలా అనుమతి ఇచ్చిందని టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. హైదరాబాదులో అల్లర్లు సృష్టించేందుకే ఇక్కడ సభ పెడుతున్నారని మండిపడ్డారు.
మా గడ్డమీద మీరెలా సభ పెడతారు?: ఈటెల
తెలంగాణ గడ్డ పైన మీరు ఎలా సభలు పెడతారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తాము సీమాంధ్ర వారికి స్నేహ హస్తం ఇస్తే వారు తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంచేస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
మందకృష్ణ నిప్పులు
ఎపిఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి తమకు హైదరాబాదులో సమావేశానికి ఎందుకు అనుమతివ్వరని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. తెలంగాణ వారికి హైదరాబాదులో సమావేశాలు పెట్టుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ పౌరుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కులనే కాకుండా అంబేడ్కర్ వారసుల హక్కులను కాలరాస్తున్నారన్నారు.
సీమాంధ్ర నుండి లక్షల సంఖ్యలో హైదరాబాదుక రప్పించి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఎపిఎన్జీవోల సభకు అనుమతి లభించిందన్నారు. ఉద్యోగస్తుల పేరుతో సీమాంధ్రులను ఇక్కడకు రప్పించి యుద్ధ వాతావరణం కల్పిస్తున్నారని మండిపడ్డారు.