డచ్ దేశంతో మెగా డీల్. మోదీ హిస్టారికల్ అనౌన్స్మెంట్!
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో, సమాన భావాలున్న దేశాల మధ్య సహకారం ఎంతో అవసరమని నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి రాబ్ జెట్టెన్ ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యం, సుపరిపాలన అంతర్జాతీయ నియమ నిబంధనలకు భారతదేశం, నెదర్లాండ్స్ ఇరు దేశాలూ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా దాదాపు దశాబ్దం తర్వాత నెదర్లాండ్స్కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల ప్రధానుల మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం, రెండు దేశాల సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్య’ స్థాయికి పెంచుతున్నట్లు ప్రధాని మోడీ అధికారికంగా ప్రకటించారు.
ప్రధాని మోడీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్ 'ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కీలక విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తలెత్తిన సంక్షోభాలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల పెరిగిన ఇంధన ధరల ప్రభావంపై ఇరు దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఇంధన ధరల సెగ నెదర్లాండ్స్తో పాటు భారతదేశంపైనా తీవ్రంగా ఉందని, ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం అత్యవసరమని జెట్టెన్ పేర్కొన్నారు. వీటితో పాటు, 'ఇన్సియా’ అనే బాలికను ఆమె తండ్రి భారతదేశానికి కిడ్నాప్ చేసిన సంచలన కేసు గురించి కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

డచ్ నైపుణ్యం.. భారత వేగం!
భారతదేశానికి ఉన్న "వేగం, నైపుణ్యాన్ని" నెదర్లాండ్స్ వద్ద ఉన్న అద్భుతమైన టెక్నాలజీ, నైపుణ్యంతో అనుసంధానించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), పెట్టుబడులు, సుస్థిరత (సస్టైనబిలిటీ) , రక్షణ రంగాలలో ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. యూరప్ దేశాలలో నవతరం నాయకత్వానికి రాబ్ జెట్టెన్ ఒక ప్రతీక అని ప్రశంసించిన మోడీ, భారతదేశంలో అత్యధికంగా యువత ఉన్నందున ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోందని గుర్తుచేశారు.
Dank u wel, premier Rob Jetten.
— Narendra Modi (@narendramodi) May 16, 2026
Ik ben blij hier in Nederland te zijn met als doel onze bilaterale samenwerking verder te versterken. De afgelopen tien jaar heeft het partnerschap tussen India en Nederland ongelooflijke vooruitgang geboekt. En nu is het tijd om daar nog meer… https://t.co/eCm5ZzQf3v
టాప్-5 ఇన్వెస్టర్లలో నెదర్లాండ్స్
రెండు దేశాల మధ్య కేవలం రాజకీయ సంబంధాలే కాకుండా బలమైన చారిత్రక, సాంస్కృతిక బంధాలు ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్న మొదటి ఐదు దేశాలలో నెదర్లాండ్స్ ఒకటి కావడం విశేషం. యూరప్లో భారతీయ ఉత్పత్తులకు నెదర్లాండ్స్ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉందని, రాబోయే రోజుల్లో భారత్-ఈయూ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే ఇరు దేశాల వ్యాపార రంగానికి మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయని వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కూడా జరిగాయి.
ప్రవాస భారతీయులకు బంపర్ ఆఫర్!
మెయిన్ల్యాండ్ యూరప్లోనే అత్యధికంగా భారతీయ సంతతి ప్రజలు నివసిస్తున్న దేశం నెదర్లాండ్స్. అక్కడ నివసిస్తున్న సుమారు 2 లక్షల మంది సురినామి-హిందుస్థానీ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధాని మోడీ ఒక కీలక ప్రకటన చేశారు. వారికి ఇచ్చే ఓసీఐ (OCI - ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డ్ అర్హతను ఇప్పటివరకు ఉన్న 4వ తరం నుండి 6వ తరానికి సరళీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మోడీ స్పష్టం చేశారు. సాంకేతిక రంగంలో స్థిరపడిన ఐటీ నిపుణులు, డచ్ యూనివర్శిటీలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు, , క్రికెట్, హాకీ వంటి క్రీడా బంధాలు ఇరు దేశాల మధ్య సజీవ వారధిగా పనిచేస్తున్నాయని ప్రధాని కొనియాడారు.
2047 నాటికి 'వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం) గా మారడమే లక్ష్యంగా డిజిటల్ వ్యవస్థలు, స్వచ్ఛమైన ఇంధనం, మౌలిక సదుపాయాల రంగంలో భారత్ వేగంగా మారుతోందని, ఈ ప్రయాణంలో విదేశాల్లో ఉన్న భారతీయులంతా భాగస్వాములు కావాలని మోడీ పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications