పర్యాటక హబ్ గా ఉత్తరాంధ్ర.. రూ.200 కోట్లతో 60ఎకరాల్లో హిలోరా ఎకో రిసార్ట్!
ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాజెక్టుల్లో హిలోరా రిసార్ట్ కీలకంగా మారుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావటంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న క్రమంలో ఈ పర్యాటక ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు భారీ అంచనాలు ఉన్నాయి. హిలోరా ఎకో రిసార్ట్స్, ది ఓజోన్ కలెక్షన్, కలర్స్ ఆఫ్ ఓ బ్లూ సంయుక్తంగా ఏవీఎన్జీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి.
ఎస్కోట ప్రాంతం ఊటీ, కొడైకెనాల్ తరహాలో అభివృద్ధి చెందే ఛాన్స్
ఈ ఒప్పందం సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్కోట ప్రాంతం ఊటీ, కొడైకెనాల్ తరహాలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో భారీ రిసార్ట్లు ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉండదని, ముఖ్యంగా జైపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా విశాఖపట్నం, చుట్టుపక్కల జిల్లాల్లోనే పెళ్లిళ్లు, ఇతర ఈవెంట్లు నిర్వహించుకోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు.

హిలోరా రిసార్ట్ తో పర్యాటక రంగానికి బిగ్ బూస్ట్
ఈ ప్రాజెక్ట్ తో ఉత్తరాంధ్రలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి సాధిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రెండేళ్లలోనే ఈ రిసార్ట్ను ప్రారంభిస్తామని హిలోరా ప్రతినిధులు చెప్పడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇక విశాఖ, విజయనగరం జిల్లాల పర్యాటక రంగానికి బిగ్ బూస్ట్ ఇచ్చేలా మరో సంస్థ కూడా ఇక్కడ బీచ్ రిసార్ట్ ను నిర్మాణం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.
బీచ్ రిసార్ట్ నిర్మించనున్న బ్లూబే ఇన్ఫ్రా సంస్థ
భీమిలి-భోగాపురం మధ్య తీర ప్రాంతంలో బ్లూబే ఇన్ఫ్రా సంస్థ బీచ్ రిసార్ట్ నిర్మించాలని నిర్ణయించింది. వెయ్యి చదరపు గజాల స్థలంలో రూ.18 కోట్ల పెట్టుబడితో 36 గదులతో ఈ బీచ్ రిసార్ట్ ను నిర్మించనున్నారు. బాలి ద్వీపంలోని రిసార్టు మాదిరిగానే ఐదు స్విమ్మింగ్ పూల్లు, డ్యూప్లెక్స్ తరహా గదులు నిర్మించాలని ప్లాన్ చేశారు.
సెలబ్రేషన్స్, ఎంటర్టైన్మెంట్ లకు బెస్ట్ ప్లేస్ గా బీచ్ రిసార్ట్స్
సాధారణ రిసార్ట్లు, హోటళ్లలో ఒక గదిలో ఇద్దరికి మించి వసతి ఉండదు. కానీ ఈ రిసార్టులో నాలుగు బెడ్లు, ఒక మీటింగ్ రూమ్, కిచెన్, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. వంద మందితో సెలబ్రేషన్స్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా అన్ని వసతులు ఒకే చోట ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం మీద విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి.
పర్యాటక హబ్ గా ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్రను పర్యాటక హబ్గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం దిశగా ఈ రకమైన పెట్టుబడులు రావటం ఏపీ ప్రభుత్వానికి సంతోషం కలిగిస్తుంది. హిలోరా ఎకో రిసార్ట్ పూర్తయితే స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా బిగ్ బూస్ట్ లభిస్తుందన్న అభిప్రాయం ఉంది.













Click it and Unblock the Notifications