అజిత్ అగార్కర్ వారసుడు ఖరారు ? ఛీఫ్ సెలెక్టర్ గా బీసీసీఐ అనూహ్య ఎంపిక..!
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా వరుస పరాజయాలతో బీసీసీఐ ఆత్మరక్షణలో పడుతోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు మరింత పెరిగేలా ఉన్నాయని భావిస్తోంది. దీంతో వచ్చే నెలలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా వచ్చే నెలతో పదవీకాలం పూర్తి చేసుకుంటున్న ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్ధానంలో మరో భారత మాజీ పేసర్ ను నియమించే దిశగా అడుగులేస్తోంది.
బీసీసీఐ పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీ చీఫ్గా అజిత్ అగార్కర్ స్థానంలో మాజీ భారత పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్లో ముగియనున్న నేపథ్యంలో.. జహీర్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించేందుకు బోర్డు సిద్దమవుతోంది. గత రెండేళ్లుగా టీమిండియాలో కీలక నియామకాలు చేసిన అగార్కర్ కు తాజాగా టీమ్ పరాజయాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయన్ను మరికొంతకాలం కొనసాగించాలనుకున్న బీసీసీఐ సైతం ఆలోచనలో పడింది. సెలెక్షన్ కమిటీ నిర్ణయాలపై, ముఖ్యంగా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ సమయంలో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు విషయంలో వ్యవహరించిన తీరుపై వచ్చిన విమర్శలు అగార్కర్ పై బోర్డులో ప్రశ్నలను లేవనెత్తినట్లు తెలుస్తోంది.

2027 ప్రపంచ కప్ కోసం టీమిండియా రోహిత్ ను పక్కన పెట్టాలని చూస్తోందని, లార్డ్స్ వన్డేనే అతడికి చివరి మ్యాచ్ కావచ్చని సెలెక్టర్లు రోహిత్కు చెప్పారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అదేమీ లేదని తేల్చేశారు. ఇప్పుడు లంకతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ ఆటతీరుపై కూడా అగార్కర్ పదవీకాలం ఆధారపడి ఉంటుంది. అగార్కర్ను తొలగిస్తే, అతని స్ధానంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు జహీర్ ఖాన్. భారత్ తరఫున 92 టెస్టులు ఆడిన ఈ సీనియర్ పేసర్ కు ఆటగాళ్లను సానబెట్టడంలో మంచి అనుభవం ఉంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్తో కలిసి పనిచేశాడు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి కూడా సాయం చేస్తున్నాడు.














Click it and Unblock the Notifications