2017వరకు గుజరాత్ సేవ: ప్రధాని పదవిపై మోడీ ట్విస్ట్
గాంధీనగర్: 2014లో భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తారని భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ గురువారం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తాను 2017 వరకు గుజరాత్ రాష్ట్రానికే సేవ చేస్తానని చెప్పారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అహ్మదాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ మాట్లాడారు. తన రాష్ట్ర ప్రజలకు తాను 2017 వరకు సేవ చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరు ఏదో చేయాలని కలలు కంటారని, తనకు తన రాష్ట్రానికి సేవ చేయాలని ఉందని చెప్పారు. తన దృష్టి అంతా గుజరాత్ పైనే ఉందన్నారు.

గత కొన్నాళ్లుగా బిజెపి లేదా ఎన్డీయే ప్రధాని రేసులో నరేంద్ర మోడి ముందంజలో ఉన్నారు. ఆయనను ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించడం వెనుక 2014 నాటికి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకేననే ప్రచారం జరిగింది.
అయితే, ఇప్పుడు మోడీ తాను 2017 వరకు గుజరాత్కు సేవ చేస్తానని చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. మోడీ తన వ్యాఖ్యల ద్వారా ప్రస్తుతానికి ఎన్డీయే ప్రధాని అభ్యర్థిత్వంగా తనపై చర్చకు తెర దించే ప్రయత్నాలు చేశారా? లేక నిజంగానే గుజరాత్కు పరిమితం అవుతారా? అదే జరిగితే అగ్రనేత అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులు ప్రధాని రేసులో ఉంటారు.












Click it and Unblock the Notifications