మార్పు లేదు, పది జిల్లాలతోనే తెలంగాణ: దిగ్విజయ్
జానారెడ్డి, షబ్బీర్ అలీ గురువారం ఉదయం దిగ్విజయ్ సింగ్ను ఆయన నివాసంలో కలుసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చర్చించారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే అంశాన్ని దిగ్విజయ్ సింగ్ మరోసారి చెప్పారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించవచ్చునంటూ సీమాంధ్రులు ప్రారంభించిన ప్రచారం మూలంగా తెలంగాణ ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని వారు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సీమాంధ్ర నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, ఎపి ఎన్జీవోలు ఈనెల 7న లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతించటం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వారు దిగ్విజయ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదంటూ ఏమైనా మార్పులు, చేర్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాత్రమే ఉందని దిగ్విజయ్ సింగ్ వారితో చెప్పారు.
జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పలువురు తెలంగాణ ఎంపీలు ఆ తరువాత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును దెబ్బ తీసేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి సమాలోచనలు జరిపినట్లు తెలిసింది.