ఒయులో బైక్ ర్యాలీ, ఉద్రిక్తత: విద్యార్థి నేతపై దాడి
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎపిఎన్జీవోల సభను వ్యతిరేకిస్తూ ఒయు ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎల్బీస్టేడియం వరకు శనివారం ఉదయం బైక్ ర్యాలీగా బయలుదేరడానికి ప్రయత్నించిన విద్యార్థులను ఎన్సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు గోబ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో , పోలీసులు టియర్గ్యాస్ను ప్రయోగించారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. సీమాంధ్ర సభ విజయవంతానికి ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఎల్బీస్టేడియం వద్ద ఓయూ జెఎసి నేత బాలరాజు యాదవ్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం ఉదయం దాడి చేశారు. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు ఖండించారు. సీమాంధ్రులే బాలరాజుపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.
ఇదిలావుంటే, టీఎన్జీవో భవన్లో తెలంగాణ జేఏసీ నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారు చర్చించారు. త్వరలో విజయవాడలో సభ పెట్టే యోచనలో జేఏసీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఎన్జీవో భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఎన్జీవో భవన్ నుంచి మీడియాను బయటకు పంపాలని కోదండరామ్ను పోలీసులు ఆదేశించారు.