రూల్స్ మార్చండి- ఉచిత సలహా ఇచ్చిన రోహిత్ శర్మ
లండన్: లండన్లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆస్ట్రేలియా చేతిలో మట్టికరిచింది. 209 పరుగుల తేడాతో చిత్తయింది. చివరి రోజు- ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. కనీసం ప్రతిఘటించలేకపోయారు. భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో దారుణంగా విఫలం అయ్యారు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్లో భారత్ ఓడిపోవడం వరుసగా ఇది రెండోసారి. 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నిర్దేశించిన 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా నాలుగో రోజే తడబడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చేతేశ్వర్ పుజారా అవుట్ అయ్యారు. మూడు వికెట్ల నష్టానికి 163 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు బ్యాటింగ్కు దిగిన టీమిండియా పరాజయం తొలి గంటలోనే ఖరారైంది.

ఇవ్వాళ ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. 44 పరుగుల తన వ్యక్తగత ఓవర్నైట్ స్కోర్కు ఇంకో అయిదు రన్స్ మాత్రమే జత చేసిన కోహ్లీ.. బోలాండ్ బౌలింగ్లో వికెట్లకు దూరంగా వెళ్తోన్న బంతిని డ్రైవ్ చేయబోయి స్లిప్స్లో ఉన్న స్టీవెన్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సెకెండ్ స్లిప్లో స్టీవెన్ స్మిత్.. కుడివైపున డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్.
అప్పటికి జట్టు స్కోర్ 179. అక్కడ ఆరంభమైన వికెట్ల పతనానికి ఎక్కడా బ్రేకులు పడలేదు. అదే స్కోర్ మీద రవీంద్ర జడేజా వికెట్ను కూడా కోల్పోయింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లు పడటంతోనే భారత్ పరాజయం దాదాపుగా ఖాయమైంది. అజింక్య రహానె- వికెట్ కీపర్ కేఎస్ భరత్ కొద్దిసేపు బౌలర్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు గానీ అది ఫలించలేదు.
రహానె-కేఎస్ భరత్ అయిదో వికెట్కు 32 పరుగులను జోడించారు. రహానె-43, కేఎస్ భరత్- 23 వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో- ఇన్నింగ్ను ముగించడానికి ఆస్ట్రేలియాకు ఎంతో సేపు పట్టలేదు. ఆ తరువాత వచ్చిన ఉమేష్ యాదవ్-0, మహ్మద్ సిరాజ్-1 పరుగులు చేశారు. మహ్మద్ షమీ- 13 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. స్పిన్నర్ నాథన్ లియాన్-4, బోలాండ్-3, స్టార్క్-2, పాట్ కమ్మిన్స్-1 వికెట్ పడగొట్టారు.
పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఐసీసీకి కీలక సూచనలు చేశాడు. ఇకపై జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్లో బెస్ట్ ఆఫ్ త్రీ అంటే మూడు ఫైనల్స్ను నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించాడు. మూడు మ్యాచ్లల్లో రెండింటిని గెలిచిన జట్టే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్గా ఆవిర్భవించేలా రూల్స్ను మార్చాలని సలహా ఇచ్చాడు.
సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్లో ఏ జట్టయినా మూడు టెస్ట్ మ్యాచ్లను ఆడుతుందని గుర్తు చేశాడు. అదే విధానాన్ని డబ్ల్యూటీసీ ఫైనల్స్లోనూ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు. వచ్చే డబ్ల్యూటీసీ నాటికి తాను బెస్ట్ ఆఫ్ త్రీ ఫైనల్స్ ఆడతానని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఓవల్ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే పిచ్ అని, అయిదు రోజులూ బ్యాటర్లకు సహకరించిందని వ్యాఖ్యానించాడు.
పిచ్ సహకరించినా తాము దాన్ని అందిపుచ్చుకోలేకపోయామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఫైనల్స్కు చేరడానికి నాలుగేళ్ల పాటు కష్టపడ్డామని, అయినా నిరాశను మిగిల్చిందని అన్నాడు. తదుపరి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమౌతామని, దేశ ప్రజలను తల ఎత్తుకునేలా చేస్తామని హామీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్లో ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు.












Click it and Unblock the Notifications