వంగవీటి రాధాకు భద్రత: 2+2 గన్ మెన్లు, సీఎం జగన్ ఆదేశాలు
తన హత్యకు కుట్ర పన్నారని వంగవీటి రాధా చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. విమర్శలు- ప్రతి విమర్శలు కొనసాగుతోన్న తరుణంలో.. ఏపీ సర్కార్ కూడా సీరియస్గా తీసుకుంది. భద్రతకు సంబంధించిన అంశం కావడంతో నేరుగా సీఎం జగన్ కల్పించుకున్నారు. పరిస్థితిని సమీక్షించి .. ఇంటిలిజెన్స్ డీజీకి ఆదేశలు జారీచేశారు. రాధాకు 2+2 గన్ మెన్లతో భద్రతను కల్పిస్తామని తెలిపారు. రాధా ప్రొటెక్షన్ చేయాలని.. అతని ఆరోపణలకు సంబంధించి విచారణ చేపట్టాలని ఐబీ డీజీని సీఎం ఆదేశిచారు. దీనికి సంబంధించి నివేదిక అందజేయాలని కోరారు.

హత్యకు కుట్ర
వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. కొంతమంది తనను చంపేందుకు కుట్ర చేశారని కామెంట్ చేశారు. ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. రాధాను చంపాల్సిన అవసరం ఎవరికుంది.. కుట్ర చేసిన వారి గురించి రాధాకు తెలుసా..? నిజంగానే రాధా మర్డర్కు ప్లాన్ జరిగిందా..? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. రంగా వర్ధంతి రోజునే రాధా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రంగా-రాధా అభిమానులు, అనుచరుల్లో కలకలం రేగింది.

ముగ్గురు స్నేహితులు
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఉదయం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి వంగవీటి రంగాకు నివాళులర్పించిన ఆయన.. కాసేపు వంశీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన జిల్లాలో పలుచోట్ల జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వంగవీటి రాధా.. మధ్యాహ్నం వంశీతో కలిసి గుడివాడ నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రి కొడాలి నాని వీరికి స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురూ కలిసి గుడ్లవల్లేరు మండలం వేమరంలోని కొండాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అదే మండలం చినగొన్నూరులో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో రాధా.. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా..
వంగవీటి రాధా, కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. కొడాలి నాని వైసీపీలో ఉండగా వంశీ అధికార పార్టీతో క్లోజ్ గా ఉంటున్నారు. రాధా టీడీపీలో ఉన్నారు. ఈ ముగ్గురి కలయిక రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాధాపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేయడంతో టీడీపీలోకి వెళ్లారని.. ఆ పార్టీ రాధాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా.. రాధా మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారని అది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. రాధా తనకు తమ్ముడి లాంటి వాడని అతనికి అన్ని విషయాల్లో తోడుంటామన్నారు. ఇంతలో ఇలా కామెంట్ చేయడం చర్చకు దారితీసింది. దీంతో ప్రభుత్వం స్పందించి.. భద్రతను కల్పిస్తోంది.












Click it and Unblock the Notifications