అక్రమాస్తులు 25 కోట్లు : సర్వేయరు అవినీతి భాగోతం బట్టబయలు
ఓ సాధారణ ఉద్యోగి ఆస్తులు 25 కోట్లు. ఏసిబి అధికారులే విస్తుపోయే మార్గాల్లో అక్రమ సంపాదన. ఏకంగా 25 కోట్లకు పడగెత్తిన సర్వేయరు. సాధారణ ఉద్యోగి గా ఉంటూ కోట్లాది రూపాయల ఆస్తులు. మూడు కేజీల బంగారం..1.5 కేజీల వెండి మొత్తంగా25 కోట్లు విలువ చేసే ఆస్తులు. ఏసిబి అధికారుల ట్రాప్ లో చిక్కాడు.
రెవిన్యూ శాఖలో సాధారణ ఉద్యోగి. సర్వేయరు గా పని చేస్తున్నారు. ఎవరి స్థిరాస్తులైనా కొలుస్తాడు.. సొంత ఆస్తులను పోగేసుకుంటాడు అని ఆయనకు పేరుంది. పైకి సౌమ్యుడిగా కనిపిస్తూనే..కోట్లాది రూపాయల ఆర్జనే లక్ష్యంగా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. కృష్ణ జిల్లా పెనమలూరు మండలం సర్వేయర్ గా రెండేళ్లుగా పని చేస్తున్న హరిబాబు ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ అధికారుల ఉచ్చులో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే బంగారు నగల దుకాణాన్ని తలపించేలా అధికారులే విస్మయానికి గురయ్యారు. 25 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తిస్తే అందులో 30 లక్షల రూపాయల విలువైన బంగారం ఉందని తేల్చారు. ఇప్పుడు ఈ కేసు ఏసిబిలో సంచలనం గా మారింది.
సర్వేయరు గా పని చేసే హరిబాబు తన వద్దకు వచ్చే ప్రతీ అర్జీకి ఒక రేటు ఫిక్స్ చేస్తాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ధనిక మండలం. రాష్ట్ర విభజన తరువాత పెరిగిన భూముల ధరలు ఇక్కడ పని చేసే హరిబాబు లాంటి వారికి కల్ప తరువుగా మారాయి. పెనమలూరు పరిధిలో భారీ వెంచర్లు..గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో భాగంగా..వ్యవసాయ భూములను మార్చటానికి హరిబాబు దగ్గరకు కొనుగోలు దారులు లెక్కల కోసం వచ్చే వారు. వారే ఆయన అక్రమార్జనకు లక్ష్యంగా మారారు. అంతే, వారి కొనుగోలు చేసిన వ్యవసాయ భూములను నివాసిత భూములుగా మార్చడానికి భారీగా ముడపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారుల దాడుల్లో ఆయన పేరున్న స్థలాలు..నివాసాలు..బంగారం వంటి వాటికి సంబంధించి ఆధారాలు- డాక్యుమెంట్లు సేకరించారు.