ఆనందయ్య ఐ డ్రాప్స్ హానికరమే.. నివేదిక, హైకోర్టులో వాదనలు, వాయిదా
కరోనా వైరస్ కోసం ఇస్తోన్న ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆనందయ్య కంటి చుక్కల మందులో హానికారక పదార్థం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు వివరించారు. ఆనందయ్య చుక్కల మందును ఐదు ల్యాబుల్లో పరీక్షించామని... మందులో ఒక పదార్థం హానికరమని పరీక్షల్లో తేలిందని చెప్పారు.
హానికర పదార్థాలు..
ఐ డ్రాప్స్ శాంపిళ్లను ఐదు సంస్థలకు పంపించగా.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, శంకర నేత్రాలయ సంస్థలు ఐ డ్రాప్స్లో హానికర పదార్థాలు ఉన్నాయని నివేదికలు ఇచ్చాయని తెలిపారు. ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదించారు. ఆనందయ్య తరపు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ మాత్రం.. ఐ డ్రాప్స్ వల్ల దుష్ప్రభావాలు ఉండవని తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ చెప్పిందని అన్నారు. కంటిమందుపై తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు.
ఆయుష్ రీసర్చ్ సెంటర్
చుక్కల మందును ఆయుష్ రీసర్చ్ సెంటర్లో టెస్ట్ చేయించాలని హైకోర్టును ఆనందయ్య తరపు న్యాయవాది కోరారు. ల్యాబ్ రిపోర్టులను తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత తదుపరి విచారణను జులై 1కి కోర్టు వాయిదా వేసింది. గత 16 ఏళ్లుగా తాను కంటిమందును వేస్తున్నానని, ఎవరికీ ఇబ్బంది కలగలేదని ఆనందయ్య తెలిపారు. మందులో ఎలాంటి విష పదార్థం లేదని తెలిపారు. ఎవరి కంటిచూపు దెబ్బతినలేదని... ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెబితే, మందు ఇవ్వడాన్ని పూర్తిగా ఆపేస్తానని చెప్పారు.
నష్టమేమీ లేదు..
మందుకు కోర్టు అనుమతించకపోయినా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని... ప్రజలే ఇబ్బంది పడతారని వ్యాఖ్యానించారు. కరోనా పాజిటివ్ వచ్చిన అందరికీ తన మందును ఉచితంగా ఇస్తున్నానని ఆనందయ్య చెప్పారు. తన పేరు చెప్పుకుని ఎవరైనా మందును అమ్ముకుంటున్నారేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మందును అమ్ముకుంటున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాలుగింటికీ ఓకే..
ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులు, ఐ డ్రాప్స్ తయారు చేయగా.. మందుల వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆనందయ్యతోపాటు మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఐ డ్రాప్స్ మినహా మిగిలిన నాలుగు రకాల మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంటి మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు దీనిపై విచారణ జరుగుతుంది.