ముందుగా ఖరీఫ్ సన్నాహాలు, నెల్లూరులో గౌతమ్ పేరుతో వర్సిటీ, ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ సారి ఖరీఫ్ సీజన్ను గడువు కంటే ముందుగా ప్రారంభించాలనే తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి కేబినెట్ భేటీ గురువారం జరిగింది. భేటీ వివరాలను మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో కంటే ముందుగానే కృష్ణా, గోదావరి జలాలను విడుదల చేస్తామని తెలిపారు. గోదావరి డెల్టాకు జూన్ 1వ తేదీన నీటిని విడుదల చేస్తారు. కృష్ణా డెల్టాకు జూన్ 10 నుంచి నీటిని విడుదల చేస్తామని.. పులిచింతల ప్రాజెక్టు నుంచి జూన్ 10న నీటిని విడుదల చేస్తామని, నాగార్జున సాగర్ నుంచి జూన్ 15 నుంచి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల నుంచి జూన్ 30 నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు.
ఖరీఫ్ సీజన్ను ముందే ప్రారంభిస్తే.. పంట కూడా ముందుగానే చేతికి వస్తుందని తెలిపారు. నవంబర్లో తుపానులు వచ్చే నాటికే పంట చేతికి వస్తుందన్నారు. రైతులు కూడా మూడు పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. వీటితోపాటు మడకసిరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెనుగొండలో టూరిస్ట్ క్యాంపస్ కోసం భూమి కేటాయింపు, నెల్లూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో యూనివర్సిటీ.. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయోఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయించారు. సంక్షేమ క్యాలెండర్కు అనుగుణంగా పథకాలు.. పామర్రులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునికీకరణ చేయనున్నారు. పులివెందులలో మహిళా డిగ్రీ కళాశాలలో నియామకాలకు.. తిరుపతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది.